శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 19 అక్టోబరు 2018 (14:32 IST)

నేను పూజించే అమ్మవారిపై ఒట్టేసి చెప్తున్నా.. యామినీ సాధినేని

జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన యామినీ ఫైర్ బ్రాండ్‌గా మారిపోయారు. టీడీపీ మహిళా నేత యామినీ సాధినేని పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందుకు సినీ నటి, పవన్ వీరాభిమాని మాధవీలత కూడా కౌంటర్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమెపై కొందరు జనసేన అభిమానులు సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడుతున్నారు. 
 
యామినీని ఉద్దేశిస్తూ బయటకి చెప్పలేని విధంగా పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. కొన్నాళ్లుగా ఉపేక్షిస్తున్నప్పటికీ జనసేన కార్యకర్తలు మరింత రెచ్చిపోవడంతో యామినీ కౌంటర్ ఇచ్చారు. జనసేన కార్యకర్తలు సంస్కృతి, సంస్కారం, మర్యాద లేకుండా వ్యవహరిస్తున్నారని.. తనను తన కుటుంబ సభ్యులను ఎంతగానో కించపరిచే విధంగా పోస్టులు పెట్టారని మండిపడ్డారు. 
 
నిత్యం ఆదిపరాశక్తిని పూజించే తనను, ఈ దేవి నవరాత్రులలో ఒక మహిళ అని కూడా చూడకుండా జనసేన పార్టీ కార్యకర్తలు ఇలా వ్యవహరించడం సబబు కాదన్నారు. వాళ్ళ కుటుంబంలో మహిళలకి కూడా తన లాంటి పరిస్తితి వస్తే.. వాళ్ల కుటుంబం పరువు ఎలా పోతుందో వాళ్ళ సంస్కారానికి వొదిలేస్తున్నానని తెలిపారు. కానీ అతి తొందరలో వాళ్ళు పశ్చాత్తాపం పడే రోజు వస్తుండన్నారు. 
 
మహిళను బాధపెట్టి, కన్నీటిని తెప్పించినవాడిని ఆ భగవంతుడు కూడా క్షమించడని.. తాను పూజించే అమ్మవారిపై ఒట్టేసి చెప్తున్నా.. మర్యాదలేని హీనులు ఎంతమంది అరిచినా, తన కర్తవ్యాన్ని నెరవేర్చడంలో వెనకడుగు వేయబోనని తెలిపారు. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.