బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (14:32 IST)

జగన్ ప్రమాణ స్వీకారోత్సవం.. రానున్న కేసీఆర్.. చంద్రబాబు వస్తారా?

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 30న విజయవాడలో జగన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి అతిరథమహారథులు వస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారని సమాచారం. 
 
వైఎస్ జగన్‌తో కేసీఆర్‌కి ఎలాంటి విభేదాలు లేవు. కానీ మున్ముందు ఎలాంటి సమస్యలూ రాకూడదని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సంప్రదాయబద్ధంగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా కేసీఆర్‌ను పిలిచారు. ఈ పిలుపు ద్వారా తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వైరుధ్యాలకు జగన్ ప్రమాణ స్వీకారోత్సవం చెక్ పెట్టే ఛాన్సుందని విశ్లేషకులు అంటున్నారు.  
 
ఇక జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ ఆహ్వానానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిసింది. ఇదివరకు టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి భూమిపూజకు కేసీఆర్‌ను ఆహ్వానించారు. కొన్ని అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలున్నా.. చంద్రబాబుతో కొన్ని కార్యక్రమాలకు కేసీఆర్ హాజరయ్యారు. 
 
కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రధానంగా చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. అయితే ఆ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓడిపోవడంతో కేసీఆర్ పైచేయి సాధించినట్లైంది. అప్పట్లో చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్, తాజాగా చంద్రబాబు ఓడిపోవడంతో మాట నెగ్గించుకున్నట్లైంది.
 
ఇక ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని తెలుస్తోంది. ఏపీకి సీఎం కానున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును ఆహ్వానిస్తారని తెలుస్తోంది. అలా జగన్ ఆహ్వానానికి చంద్రబాబు సానుకూలంగా స్పందించి.. ప్రమాణ స్వీకారానికి హాజరవుతారో లేదో వేచి చూడాలి.