శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (09:10 IST)

దురదృష్టం అంటే ఇదీ... ఓటు వేయని సర్పంచ్ అభ్యర్థి.. ఒక్క ఓటు తేడాతో ఓడాడు...

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా, తొలిదశ ఎన్నికల పోలింగ్ సోమవారం జరిగింది. ఈ పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో ఒక సర్పంచ్ అభ్యర్థి కేవలం ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయాడు. 
 
ఆ ఓటు కూడా సర్పంచ్ అభ్యర్థిగా ప్రతి ఒక్కరినీ తనకు ఓటు వేయాలని పదేపదే కోరిన ఆయనే... చివరకు తన ఓటు వేసేందుకు మరచిపోయాడు. ఫలితంగా కేవలం ఒక్క ఓటు తేడాతో ఓటమిని చవిచూశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలోని రంగాపురం గ్రామ సర్పంచ్ పదవికి మర్రి ఆగంరెడ్డి, రామిడి ప్రభాకర్ రెడ్డి వేర్వేరు పార్టీల తరపున పోటీ చేశారు. సోమవారం ఎన్నికలు నిర్వహించగా మధ్యాహ్నం వరకు ఆగంరెడ్డి దంపతులు తమకే ఓటు వేయాలంటూ అందరినీ అభ్యర్థించారు. 
 
తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అయితే, ప్రచారంలో పూర్తిగా నిమగ్నమైన ఆ దంపతులు... తమ ఓటును వేసుకోవడం మరచిపోయారు. పోలింగ్ ముగిసి, ఓట్ల లెక్కింపు చేపట్టిన తర్వాత వారిద్దరి ఓట్లే ఫలితాలన్ని తారుమారు చేసింది. ప్రత్యర్థి ప్రభాకర్ రెడ్డి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. 
 
ఆగంరెడ్డి దంపతులు తమ ఓట్లను వేసుకుని ఉంటే రెండు ఓట్లు పడేవి. ఫలితంగా ఒక్క ఓటు తేడాతో ఆయనే గెలిచి ఉండేవారు. ఓటు వేయడంలో నిర్లక్ష్యం అతడి జీవితాన్ని తారుమారు చేసింది. చేసేది లేక ఇప్పుడు తీరిగ్గా బోరున విలపిస్తున్నారు ఆ దంపతులు.