శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యం.. మంత్రి మేకపాటి

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే తక్షణ కర్తవ్యంగా ముందుకెళుతున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

గురువారం ఢిల్లీలో ప్రపంచ ఆర్థిక సమాఖ్య సదస్సు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పారదర్శకత, సుపరిపాలనకు విలువనిస్తూ రాష్ట్రాభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమని మంత్రి మేకపాటి తెలిపారు. నైపుణ్యంలేని ఉద్యోగాలు అందించడం కాకుండా నైపుణ్య శిక్షణతో కూడిన స్థానికులకే 75 శాతం ఉద్యోగాలను యువతకు అందించేందుకు శిక్షణకేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి అడుగులు పడుతున్నాయన్నారు.

పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాన్ని ముందే తెలుసుకుని వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటయ్యే శిక్షణ కేంద్రాల్లో  యువతకు నేర్పించి, వారికి అవసరమైన విధంగా తయారు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటోందని గౌతమ్ రెడ్డి పునరుద్ఘాటించారు.
 
‘బ్రాండథాన్’తో...ఏపీకి బ్రాండ్ ఇమేజ్..యువతే అంబాసిడర్లు
ఏపీకి సరికొత్త బ్రాండింగ్ సృష్టించే దిశగా బ్రాండథాన్ ను నిర్వహించనున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. సరికొత్త ఆలోచనలున్న యువతీయువకుల నుంచి అభిప్రాయాలు సేకరించి రాష్ట్ర ప్రతిష్టను పెంచడంలో యువతను కీలక భాగస్వామ్యం చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

నిర్ణీత గడువు 29లోగా వినూత్న ఆలోచనలను స్వీకరించి వాటిలో  ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచే ఉత్తమ ఆలోచనలను ఎంపిక చేసే బాధ్యతను ఒక కమిటీ ఏర్పాటు చేసి, వారికి ఆ నిర్వహణ బాధ్యత అప్పగిస్తామని మంత్రి అన్నారు. అత్యుత్తమ ఆలోచనలను ప్రోత్సహించడం కోసం ప్రథమ,ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు అందిస్తామన్నారు.

మొదటి బహుమతికి రూ.50వేలు, రెండవ బహుమానానికి రూ.25వేలు, మూడవ బహుమతికి రూ.10వేలు నగదు బహుమానం ఇస్తామని, గుర్తింపు పత్రాలు అందజేస్తామని వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా రాష్ట్రాభివృద్ధి ఉండదని నమ్మే ముఖ్యమంత్రి ఆలోచనను ఆచరణలో పెట్టేందుకే వాకథాన్, మారథాన్ మాదిరిగా బ్రాండథాన్ నిర్వహించనున్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు.

బ్రాండథాన్ తో  పారిశ్రామికవృద్ధి పరుగులు పెట్టించేందుకు కృషిచేయనున్నట్లు మంత్రి మేకపాటి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారని మంత్రి అన్నారు.  పారదర్శకతను ఆచరణలో చూపుతోన్న ఏపీలో వాణిజ్యానికి పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారన్నారు మంత్రి మేకపాటి.

కొత్త పాలసీ విధానం అమలులోకి తెచ్చాక పరిశ్రమలు తరలిరావడం ఖాయమని మంత్రి వెల్లడించారు. జపాన్ తో సహా చాలా దేశాలు ఆంధ్రప్రదేశ్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలుమార్లు జరిగిన చర్చల్లో ఆసక్తి కనబరిచినట్లు స్పష్టం చేశారు.

31 ఎంఎస్ఎంఈ క్లస్టర్ల ఏర్పాటుతో పాటు 13 జిల్లాల్లో ఇండస్ట్రియల్ జోన్లుగా మార్చడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. రానున్న ఐదేళ్లలో 5 ట్రిలియన్ల ఎకనమి తీసుకురావడమే ధ్యేయంగా ముందుకెళుతున్న కేంద్ర ప్రభుత్వానికి బాసటగా ఆంధ్రప్రదేశ్ తనదైన ముద్ర వేస్తుందనడంలో సందేహం అక్కర్లేదన్నారు.

ఇప్పటికే జీడీపీ 180 బిలియన్ డాలర్ల ఆదాయంతో దేశంలో 9వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను మరింత రెట్టింపు ఆదాయం తెచ్చి అగ్రపథంలో నిలబట్టాలనేదే కింకర్తవ్యమని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. 

సులభతర, పారదర్శక పారిశ్రామిక విధానంతో ఇవన్నీ సుసాధ్యమని మంత్రి అన్నారు. పాలసీతో పాటు మౌలిక సదుపాయాలు, విద్యుత్, నీరు వంటి వనరులు, సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అనుకున్నది చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

నవరత్నాల అమలుతో రాష్ట్రంలో సంక్షేమం కొత్తపుంతలు తొక్కుతోందని అదే విధానంతో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో హిండ్ వైర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఢిల్లీలోని తాజ్ క్లబ్ హోటల్ లో  హిండ్ వైర్ వైస్ ఛైర్మన్ మరియు ఎండీ సందీప్ సోమని తదితర ప్రతినిధుల బృందం భేటీ అయింది.

హిండ్ వైర్ కంపెనీ గురించి ఆ సంస్థ ఎండీ.. మంత్రికి వివరించారు. అనంతరం జపాన్ కు చెందిన మంత్రిని మిట్సుబిషి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ప్రతినిధులు మంత్రి మేకపాటితో భేటీ అయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ గురించి చర్చించారు.

రాష్ట్రంలో విద్యుత్ వాహనాలకు పెద్దపీట ప్రభుత్వం వేయనున్న సమయంలో కంపెనీ ప్రతినిధులు అనేక అంశాలపై కీలకంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు.
 
సౌకర్యాలు, వాతావరణం, సదుపాయాల వంటి విషయాలను ప్రామాణికంగా తీసుకుంటే విభజనకు తర్వాత ఆంధ్రప్రదేశ్ కు గల ఏకైక పట్టణం విశాఖపట్నమని మంత్రి మేకపాటి అన్నారు. రాష్ట్రంలో చెప్పుకోదగ్గ నగరం విశాఖ అయినప్పటికీ దాని ద్వారా వచ్చే ఆదాయం తక్కువన్నారు.

అమరావతిని గత ప్రభుత్వం ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ప్రయత్నించిందన్నారు. ప్రస్తుతం అమరావతిని పాలనా పరంగా అనుకూలమైన నగరంగా మలచుకుంటున్నట్లు వెల్లడించారు.

వల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు వెల్లడించేందుకు ప్రతినిధులుగా వచ్చిన ముఖ్యమంత్రులు, మంత్రులను భారతదేశ అభివృద్ధికి అన్వేషించాల్సిన మార్గాలు, దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర వంటి అంశాలపై చర్చా కార్యక్రమం జరిగింది. 

ప్రపంచస్థాయి పట్టణాలుగా ఆంధ్రప్రదేశ్ లోని నగరాలను మార్చాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయమన్నారు. విశాఖకు కొంత ఖర్చుపెడితే ఆదాయం , వాణిజ్యం పెరుగుతుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తుతం వ్యాపారం, రియల్ ఎస్టేట్, పరిశ్రమలు కీలక రంగాల్లో వెనుకబడుతున్నాయన్నారు.

రాజధాని లేకపోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇబ్బందికరమైన విషయమే అయినా ధైర్యంగా అభివృద్ధికోసం తపనతో ముందుకు వెళుతున్నామన్నారు. ఆర్థిక వృద్ధికి ఆదాయమే ముఖ్యమార్గమని మంత్రి అన్నారు. ఆదాయం ఉంటే ఒకదాని తరువాత మరొక వెనుకబడిన విషయాలపై దృష్టి పెట్టవచ్చన్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 3 ముఖ్య ప్రాథమిక సూత్రాలను అనుసరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. దేశ జీడీపీలో మొదటి 5 రాష్ట్రాలు 43 శాతం ఆదాయంతో ముఖ్య భూమిక పోషిస్తుండగా, జీడీపిలో ప్రస్తుతం 180 బిలియన్ డాలర్లతో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉందన్నారు.

ఆ ర్యాంకుని మెరుగుపర్చుకునేందుకు, ఆదాయం పెంచేందుకు తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించుకుని ఆర్థికంగా బలోపేతమవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. సామాజిక విధానం, ఆర్థిక విధానం, పారిశ్రామిక విధానం వంటి ప్రాథమిక సూత్రాలతో రాష్ట్రాన్ని ఊహించని స్థాయిలో నిలబెట్టే దిశగా అడుగు ముందుకు వేస్తామని మంత్రి వివరించారు.

కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ , మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.