శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 16 ఆగస్టు 2018 (22:28 IST)

దేశం గొప్పనాయకుడిని కోల్పోయింది...: వాజ్‌పేయి మృతిపై సీఎం చంద్రబాబు

అమరావతి : మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి మృతి బాధాకరమని, దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విచారం వ్యక్తంచేశారు. సచివాలయంలోని ఒకటో నెంబర్ బ్లాక్ ఎదుట తనను కలిసిన విలేకరులతో గురువారం రాత్రి మాట్లాడారు. వ

అమరావతి : మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి మృతి బాధాకరమని, దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విచారం వ్యక్తంచేశారు. సచివాలయంలోని ఒకటో నెంబర్ బ్లాక్ ఎదుట తనను కలిసిన విలేకరులతో గురువారం రాత్రి మాట్లాడారు. వాజ్ పేయి చాలా రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆయన హయాంలో దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా జరిగాయన్నారు. స్వర్ణ చతుర్భుజి ద్వారా నూతన శోభ వచ్చిందన్నారు. 
 
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరుతో గ్రామాల్లో రోడ్లు నిర్మించారన్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు ఆయన హయాంలోనే వచ్చాయన్నారు. అనేక సమయాల్లో ఆయనతో విభేదించినా కలిసి ముందుకు సాగామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుందని, గొప్ప దార్శనికుడని, మంచి వాగ్దాటి గలవారని కొనియాడారు. వాజ్ పేయికి ఎవరితోనూ గొడవలు లేవన్నారు. అందర్నీ కలువుకుని పోయేవారన్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరితో కలిసిపోయే వారన్నారు. ఆయన చేసిన పనులు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. 
 
తనకంటే వాజ్ పేయి 26 ఏళ్లు పెద్దని, 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసినవుడు ఆయన మద్దతు ఇచ్చారని తెలిపారు. వాజ్‌పేయి సెక్యూలర్ వాది అని, ప్రజాస్వామ్యం కాపాడడానికి బాగా కృషి చేశారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు టీడీపీకి 29 మంది ఎంపీలున్నా, కేబినెట్లో చేరకుండా చివరి వరకూ సహకరించామన్నారు. అందుకే తానంటే వాజ్ పేయికి అభిమానమన్నారు. తొలుత అబ్దుల్ కలాం కంటే అలెగ్జాండర్‌ని ఎంపిక చేసినపుడు ఆయనతో విభేదించానన్నారు. ఆ తర్వాత కలాంకు మద్దతు ఇచ్చామని, అది కూడా ఆయన మనసులో పెట్టుకోలేదని అన్నారు. ఆయనకు తన మీద ప్రత్యేక అభిమానం ఉండేదన్నారు. తానెప్పుడు పదవి అడగలేదని, ప్రజల కోసం పని చేస్తానని తనను ఆయన నమ్మారన్నారు. చివరి వరకూ అవే సంబంధాలు అటల్ బిహారీ వాజ్ పేయితో కొనసాగాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లి వాజ్‌పేయికి నివాళుల్పిస్తానన్నారు.