గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (14:05 IST)

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వం.. మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ : ప్రేక్షక పాత్రలో ఏపీ ఎంపీలు

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కడం ఎండమావిగామే మారనుంది. కొత్తగా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ తేటతెల్లం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం లోక్‌సభలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 
 
అంతేకాకుండా, బీహార్ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని, ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారని గుర్తుచేశారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా అసాధ్యమని తేలిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు శరాఘాతంగా మారనున్నాయి. 
 
ఒకవైపు లోక్‌సభ సాక్షిగా మంత్రి ఇంద్రజిత్ సింగ్ ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేస్తున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీలు మాత్రం ప్రేక్షకుల్లా మిన్నకుండిపోయారు. మంత్రి వ్యాఖ్యలను ఏమాత్రం ఖండించడం లేదా... సభలో నిరసన వ్యక్తం చేయడం వంటి చర్యలు చేయకుండా ప్రేక్షకుల్లా సభలో మిన్నకుండి పోవడం గమనార్హం.