శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2020 (13:19 IST)

సీఆర్డీఏ రద్దు.. భవిష్యత్‌లో అంతా ఇలా జరుగుతుందా?

రాజధాని ప్రాథికార అభివృద్ధి సంస్థ (ఏపీ సీఆర్డీఏ) రద్దుకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదముద్ర వేశారు. దీంతో సీఆర్డీఓ భవితవ్యంపై చర్చ మొదలైంది. సీఆర్డీఏ రద్దుతో అమరావతి మెట్రో పాలిటన్‌ రీజనల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు కానుంది. రాష్ట్రంలో పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ నగరపాలక సంస్థలో తుళ్లూరు, తాడేపల్లి కలుపుతూ ఏఎంఆర్‌డీఏకు రూపకల్పన జరుగుతోంది. 
 
రాజధాని ప్రాంత రైతులు నష్టపోకుండా అర్బన్‌ అథారిటీ కిందకు తెస్తే ఈ ప్రాంతం అభివృద్ధితో పాటు పాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు రాష్ట్రం మొత్తంగా అభివృద్ధి సాధించేం దుకు ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసుకుంది. ఇకపై సీఆర్డీఏ అధికారాలన్నీ కొత్తగా ఏర్పాటయ్యే అమరావతి మెట్రోపాలిటన్‌ రీజనల్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా బదలాయించాల్సి ఉంది. 
 
సీఆర్డీఏ రద్దు బిల్లుకు సంబంధించి 27వ చట్టసవరణ కింద అమరావతి మెట్రోపాలిటన్‌ రీజనల్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా ఏర్పాటు చేస్తూ విధి విధానాలను నిర్దేశించింది. సీఆర్డీఏ పరిధిలో భవన నిర్మాణాలకు లేఅవుట్లు, ప్లాన్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళిక, జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్లు, అంతర్గత రోడ్లు, రహదారుల అనుసంధానం, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుతో పాటు ప్రధానంగా భూ సమీకరణ, భూ కేటాయింపులు, పెట్టుబడుల ఆకర్షణ, రాజధాని నగరానికి రవాణా సదుపాయాలు, పర్యాట కంగా అభివృద్ధి పనులు నిర్వహించాల్సి ఉంది.
 
ఇప్పటికే రాజధాని నిర్మాణానికి 25 వేల 600 మంది రైతులు 33 వేల 500 ఎకరాలు ఇచ్చారు. వీటితో పాటు మరో 20 వేల ఎకరాలు అటవీ , బంజర భూములు ఉన్నాయి. వీటన్నింటినీ రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో సేకరించింది. ఈ భూముల్లో కొన్ని ప్రముఖ వ్యాపార విద్యాసంస్థలకు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు, కేంద్ర అనుబంధ సంస్థలకు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత సింగపూర్‌ కన్సార్టియమ్‌తో చేసుకున్న బప్పందంలో భాగంగా 1691 ఎకరాలు ఆ సంస్థకు ఇచ్చారు. 
 
ఇదంతా రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం గత ప్రభుత్వం సీఆర్డీఏ ద్వారా సింగపూర్‌ కన్సార్టియమ్‌తో ఒప్పందం చేసుకుంది. ఇకపై ఈ లావాదేవీలన్నీ సీఆర్డీఏ రద్దు కావడంతో ఏఎంఆర్డీఏ నిర్వహిస్తుంది. 
 
రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ కింద రైతులిచ్చిన భూములకు కౌలు, వ్యవసాయ కూలీలకు పింఛన్ల పంపిణీ, నిర్మాణ ప్రాజెక్ట్‌ బాధ్యతలు ఏఎంఆర్డీఏ పర్యవేక్షిస్తోంది. సీఆర్డీఏను రద్దు చేస్తూ కొద్దిపాటి మార్పులు, చేర్పులతో ఏఎంఆర్డీఏ ఏర్పాటు కానుంది.
 
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రస్తుతం సీఆర్డీఏ పరిధిలోని ప్రాంతాలన్నీ ఏఎంఆర్డీఏ పరిధిలోకి వస్తాయి. చట్టంలోని 28(4) ప్రకారం సీఆర్డీఏ స్థిర, చరాస్తులు, విడుదల చేసిన బాండ్లు ఇతర ఆర్థిక పరమైన అంశాలన్నీ ఏఎంఆర్డీఏకు బదలాయించటంతో పాటు ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. రద్దుకు ముందున్న అధికారులు, ఉద్యోగులంతా కొత్తగా ఏర్పాటయ్యే సంస్థకు డిప్యూటేట్‌ చేస్తారు.
 
అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని స్థానిక సంస్థలకు బదిలీ చేస్తారు. భూ సమీకర ణ రైతులకు ప్లాట్ల కేటాయింపు, కౌలు, భూమిలేని నిరుపేదలకు ఇచ్చే పింఛన్‌ను రూ. 2500 నుంచి రూ. 5వేలకు పెంచటం ద్వారా ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ లావాదేవీలను ఏఎంఆర్డీఏ నిర్వహిస్తుంది. సవరించిన చట్టం ప్రకారం ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములిచ్చిన రైతులకు ప్రభుత్వ భరోసాతో మరో ఐదేళ్ల పాటు కౌలు చెల్లింపులు జరుపుతారు. అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి అధికారం ఉంటుంది. 
 
సీఆర్డీఏ రద్దుకు ముందున్న మాస్టర్‌ ప్లాన్లు, జోనల్‌ అభివృద్ధి ప్రణాళికలు, పట్టణ, నగర ప్రణాళికలు కొనసాగిస్తారు. భూ వినియోగ స్థితిగతులకు అనుగుణంగా మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు, చేర్పులు ఉంటాయి. భూ కేటాయింపులకు సంబంధించిన ఒప్పందాలను ఏఎంఆర్డీఏ పరిష్కరిస్తుంది. 2016 చట్ట ప్రకారం భవిష్యత్‌లో భూ కేటాయింపుల బాధ్యతను ఏఎంఆర్డీఏ నిర్వహిస్తుంది.