శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (14:01 IST)

తుంగభద్ర నదికి పుష్కరాలు.. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1వరకు

Tungabhadra Pushkaralu
పవిత్ర తుంగభద్ర నదికి పుష్కరాలు శార్వరీ నామ సంవత్సరంలో జరగనున్నాయి. పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలు నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 దాకా ఇవి జరగనున్నాయి. ఒక్కొక్క రాశిలో గురువు ప్రవేశించేటపుడు ప్రతి నదికి పుష్కరాలు జరుపుతారు. దేశంలో పుష్కరాలు జరిపే 12 నదులలో తుంగభద్ర ఒకటి. నవగ్రహాల్లో ఒకటైన గురు గ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో పరిభ్రమిస్తుంటుంది. 
 
బృహస్పతి మకరరాశిలో ప్రవేశించే సమయంలో తుంగభద్ర నదికి పుష్కరాలు జరుపుతారు. చివరిసారిగా 2008లో ఈ నదికి పుష్కరాలు జరిగాయి. ఈ పుష్కరాలు జరిగే 12 రోజుల్లో ముక్కోటి దేవతలు ఆ నదులలో కొలువై ఉంటారని ప్రతీతి. ఈ సమయంలో ఆ నదిలో స్నానమాచరించిన వారి పాపాలు తొలిగి.. పుణ్యం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
 
పశ్చిమ కనుమల నుంచి మొదలై.. కర్నాటక ఎగువ భాగాన ఉన్న పశ్చిమ కనుమలలో ఉద్భవించినవే తుంగ భద్ర. ఇది కర్నాటకలో కృష్ణా పరివాహక ప్రాంతం మీదుగా ప్రవహిస్తూ.. కర్నూలు జిల్లాలో గల కౌతాళం మండలం మేళగనూరు వద్ద ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది. 
 
నదీ తీరంలో కొలువైన దేవాదిదేవతల పాదాలను అభిషేకిస్తూ.. సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలలోని నదుల్లో సమృద్ధిగా వర్షాలు కురవడంతో నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. తుంగభధ్ర నది కూడా జలకళతో కళకళలాడుతున్నది. భక్తులు స్నానాలు చేయడానికి కర్నూలు జిల్లాలో గతంలో 17 ఘాట్లను ఏర్పాటు చేశారు. 
 
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఆలంపూర్‌లోనూ ఈ పుష్కరాలు జరుగుతాయి. కర్నూలులో.. మంత్రాలయం, సంగమేశ్వరం, కౌతాలం, గురజాల, పుల్లికల్, రాజోలి, నాగల దిన్నెలలో ఏర్పాట్లు చేయనున్నారు. ఈ పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక నుంచే గాక తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటకలోనూ ఈ పుష్కరాలను ఘనంగా జరుపుకుంటారు.