శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (14:36 IST)

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను గోదావరిలో కలిపేశారు : ఉండవల్లి

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను గోదావరి నదిలో కలిపివేశారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగానే ఏపీకి ప్రత్యేక హోదా సాధించాల్సి ఉందన్నారు. ఈ మేరకు టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్డీఏ సర్కారుకు అల్టిమేటం జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
రాష్ట్ర విభజన అనంతరం కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని ఆయన ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే, నరేంద్ర మోడీ కేబినెట్ నుంచి తన పార్టీ మంత్రులతో చంద్రబాబు రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఎమ్మెల్సీ సంఖ్యపై ఉన్న దృష్టి ప్రత్యేక హోదాపై లేదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రానికి టీడీపీ అల్టిమేటం ఇవ్వాలని, ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఉపంసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.