గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 నవంబరు 2020 (13:54 IST)

పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. సీఎం వైఖరేంటో?: ఉండవల్లి

పోలవరంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ డిమాండ్ చేశారు. పోలవరంపై వైసీపీ వైఖరేంటో సీఎం జగన్ చెప్పాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించమని చంద్రబాబు నుంచి ఎటువంటి లేఖ ఇవ్వలేదు. కేంద్రం.. ఏపీకి పోలవరం ప్రాజెక్టు అప్పగించడంపై స్పష్టత లేదు. ఏపీ ప్రభుత్వానికి అవమానం కలిగేలా కేంద్రం లేఖ రాసింది.
 
పోలవరానికి నిధులు ఇవ్వాలని కేంద్రమే చెప్పింది. 2017 కేబినెట్‌ నోట్‌లో ఏముందో అప్పుడే బయటపెట్టా. 2014 నాటి రేట్లకు 2020లో పనులు చేస్తారా?.. ఇది ధర్మమా? పోలవరం రిజర్వాయర్, పవర్ ప్రాజెక్టు ఉంటుందా? నీతి ఆయోగ్ ప్రధానికి రాసిన లేఖ ఏంటి? ఏపీకి అన్యాయం జరుగుతుంటే అడగడానికి భయమెందుకు? ప్రజలు అనుకున్నట్లు సీబీఐ కేసులకు భయపడుతున్నారా?' అని సీఎంను ఉద్దేశించిన ఉండవల్లి వ్యాఖ్యానించారు.
 
పోలవరంకు కేంద్రం నిధులు విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో కేంద్రం తరుఫున రీయింబర్స్ మెంట్ నిమిత్తం రూ.2234.28 కోట్లను మంజూరు చేసింది. దీనికి సంబంధించిన నాబార్డ్ డీజీఎం వికాష్ భట్ ఉత్తర్వులు జారీ చేశారు.ఆ నిధులను జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ పోలవరం ఆథారిటీ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వానికి అందజేయనుంది. వచ్చే నెల మొదటి వారంలో ఆ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ కానుంది.
 
ఇటీవల సీఎం జగన్ పోలవరం జాతీయ ప్రాజెక్టు అని.. కేంద్రమే దీన్ని భరించాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు లేఖ రాశారు. ఈ క్రమంలోనే కేంద్రం స్పందించి పోలవరానికి రూ.2234 కోట్లు విడుదల చేశారు.