శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 1 మార్చి 2015 (14:20 IST)

బడ్జెట్‌పై అనుమానాలుంటే జైట్లీని కలవండి : వెంకయ్య ఉచిత సలహా!

తాజాగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఏవైనా అనుమానాలు ఉంటే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలవాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఉచిత సలహా ఇచ్చారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘సమస్యలుంటే చర్చించుకుందాం. బహిరంగ విమర్శలతో ఫలితం శూన్యం. బడ్జెట్‌లో ఏదైనా అనుమానాలుంటే అరుణ్ జైట్లీని కలవండి’ అంటూ ఓ ఉచిత సలహా ఇచ్చారు.
 
శనివారం జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌పై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నిధుల కేటాయింపులో కేంద్రం తమకు మొండిచేయి చూపిందని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వ్యాఖ్యానించారు. 
 
ఇరువురు సీఎంల ఆగ్రహావేశాలను తగ్గించేందుకు వెనువెంటనే వెంకయ్య రంగంలోకి దిగారు. నిధుల కేటాయింపుపై జైట్లీతో మాట్లాడమని ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్పానన్నారు. నిధుల కేటాయింపులకు సంబంధించి సవరణలు చేసేందుకు యత్నిస్తామని కేసీఆర్‌కు చెప్పానన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెంకయ్య హామీ ఇచ్చారు.