గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2019 (19:05 IST)

విభిన్నప్రతిభావంతులకు యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డులు

రాష్ట్రంలోని విభిన్నప్రతిభావంతులకు(వికాలాంగులు) యూనిక్ డిజబిలిటీ గుర్తింపు కార్డులను(స్మార్ట్ కార్డులు) జారీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు.

విభిన్న ప్రతిభా వంతులకు యుడిఐడి కార్డులు జారీ చేసే అంశంపై మంగళవారం అమరావతి సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు యూనిక్ డిజబిలిటీ గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా వారి వివరాలను సేకరించి ఆన్లైన్ పోర్టల్ లో అప్ లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఆ విధంగా సేకరించిన వివరాలన్నిటినీ పరిశీలించి ప్రభుత్వ ప్రవేట్ మెడికల్ కళాశాలల భాగస్వామ్యంతో సకాలంలో సర్టిఫికెట్లు జారీచేసి తదుపరి యుడిఐడి కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.ఇప్పటికే సదరమ్ సర్టిఫికెట్లు కలిగిన వారు మరలా ఇందుకోసం వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేకుండా సెర్ప్ వద్ద ఉన్న డేటాను అంతటినీ నేరుగా యుడిఐడి కార్డులు జారీ చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థకు పంపాలని సిఎస్ ఆదేశించారు.

ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకుగాను వైద్య ఆరోగ్య, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలతో సమన్వయం చేసి వెంటనే ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని విభిన్న స్ర్తీ శిశు,ప్రతిభావంతుల సంక్షేమశాఖల ముఖ్య కార్యదర్శి దమయంతిని సిఎస్ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. 


రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)ద్వారా ఇప్పటి వరకూ 13 జిల్లాల్లో వికలాంగులకు సదరమ్ సర్టిఫికెట్ల జారీకి 12లక్షల 35వేల 493 ధరఖాస్తులు స్వీకరించి 10లక్షల 78వేల 70 ధరఖాస్తులను అనగా 87.26 శాతం అంకవైకల్య నిర్ధారణ చేయగా వాటిలో 8లక్షల 48వేల 422 మందికి సదరమ్ సర్టిఫికెట్లను జారీ చేయడం జరిగిందని స్త్రీశిశు మరియు దివ్యాంగుల సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.దమయంతి వివరించారు.

వాటిలో 5లక్షల సర్టిఫికెట్లకు సంబంధించిన డేటాను యుడిఐడి కార్డులు జారీ చేసే సంస్థకు బదిలీ చేయగా మరో 4లక్షల మందికి సంబంధించిన డేటాను బదిలీ చేయాల్సి ఉందని చెప్పారు.గత ఏడాది ఆగస్టు 3 నుండి అక్టోబరు 20 వరకూ డిజిటల్ సర్టిఫికెట్ల జారీకై మీసేవ కేంద్రాల ద్వారా ప్రత్యేక స్లాట్లను కేటాయించగా 80వేల 995 మంది ధరఖాస్తు చేయగా వారిలో 57వేల 662 మందికి సర్టిఫికెట్లను జారీ చేసినట్టు తెలిపారు.

కాగా యుడిఐడి కార్డులకు సంబంధించి ఇప్పటికే జోన్ల వారీగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు.ఆన్లైన్లో ధరఖాస్తులు స్వీకరణకు ఇ-ప్రగతి బృదం ద్వారా గ్రామ,వార్డు సచివాలయాల్లో పోర్టల్ ను అందుబాటులోకి తేవడం జరుగుతుందని అన్నారు.

 
విభిన్న ప్రతిభావంతులకు(వికలాంగులు)స్వావలంబన కార్డు పేరిటి స్టాండర్డ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు సైజులో జారీ చేయనున్న యూనివర్సల్ యుడిఐడి కార్డుతో అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి.ముఖ్యంగా వికలాంగులైన వారు వారి అంగవైకల్యాన్ని రుజవు చేసేందుకు పలు సర్టిఫికెట్లను కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు.

అంతేగాక ప్రస్తుతం వికలాంగులకు ఒక రాష్ట్రంలో జారీ చేసిన సర్టిఫికెట్లను మరో రాష్ట్రంలో ఆమోదించక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవని దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఈయూనియక్ డిజబిలిటీ ఐడి కార్డు ఆమోదించే విధంగాఉంటుంది.అంతేగాక కార్డును ప్రయాణ సమయంలో జేబులో గాని లేదా పర్సులోగాని సులభంగా తీసుకువెళ్లేందుకు వీలుంటుంది.

అదే విధంగా ఈయుడిఐడి కార్డుతో దేశవ్యాప్తంగా రైల్వే సేవలను సులభంగా పొందేందుకు,విద్యా సంస్థల సేవలను పొందేందుకు ఎంతో సులభంగా ఉంటుంది.ఈకార్డు ద్వారా ఆయా వికలాంగుని అంగవైకల్యం వివరాలను కార్డురీడర్ డివైస్ ద్వారా తెల్సుకునేందుకు అవకాశం కలుగుతుంది.

అంతేగాక ఒకసారి ఈవిధంగా యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డు జారీ అయితే రియల్ టైమ్ లో ఆయా వికలాంగుల పరిస్థిని ప్రభుత్వం సులభంగా తెల్సుకునేందుకు వీలుంటుంది.ఒక వికలాంగునికి సంబంధించిన అంగవైకల్యం వివరాలు ఒకసారి నమోదైన తర్వాత అవి కంప్టూటర్ సిస్టమ్ లో మరోకసారి డూప్లికేట్ అవ్వకుండా ఉండే యూనిక్ నెస్ ఈ కార్డులకు ఉంటుంది.

ఎంత శాతం మేరకు అంగవైకల్యాన్ని కలిగి ఉన్నాడనేది ఈకార్డు ద్వారా సులభంగా తెల్సుకునేందుకు వీలుంటుంది.అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేసే వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలు ఆయా వికలాంగులకు ఏవిధంగా అందుతున్నాయనేది సులభంగా తెల్సుకునేందుకు వీలుంటుంది.

సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ కమీషనర్ దుర్గాప్రసాద్, దివ్యాంగుల సంక్షేమశాఖ సంచాలకులు డా.జిసి కిషోర్ కుమార్, సెర్ప్ సిఇఓ రాజబాబు, కేంద్ర ప్రభుత్వ క్సనల్టెంట్ గుప్త తదితరులు పాల్గొన్నారు.