ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 13 జులై 2020 (20:09 IST)

పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోండి

ఆస్పత్రుల్లో అడ్మిషన్ల సమయంలో కరోనా అనుమానితుల పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలని ఏపీ వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. జిల్లాకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లను ప్రభుత్వం పంపించింది.

ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో పాజిటివ్ అని తేలితే తక్షణం చికిత్స ప్రారంభించి సదరు రోగిని ఐసోలేట్ చేయాలని జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్ఓలకు సూచనలు చేసింది. కరోనా లక్షణాలు కలిగి యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వస్తే  అలాంటి వారికి మరోమారు రియల్ టైమ్‌లో ఆర్టీపీసీఆర్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

హైరిస్కు కేసులు కలిగిన ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో వ్యాధి లక్షణాలు కలిగి కరోనా నెగెటివ్ ఫలితాలు వచ్చిన వారిని కూడా పరీక్షించాల్సిందిగా సూచనలు జారీ చేశారు. ఆస్పత్రుల్లో గర్భిణులు, శస్త్ర చికిత్స చేయాల్సిన రోగులకు పరీక్షించేందుకు కూడా ఈ కిట్లు వినియోగించాలని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.

క్వారంటైన్ కేంద్రాల్లో 10 రోజుల క్వారంటైన్ అనంతరం డిశ్చార్జి అవుతున్న వారిని కూడా ఈ కిట్లతో పరీక్షించవచ్చని సూచించింది. అయితే కరోనా లక్షణాలు కలిగి ఉన్న రోగులందరినీ డిశ్చార్జి చేసేందుకు ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.