1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 మే 2016 (17:36 IST)

పెడదారిలో వెళ్లను.. ఊపిరి ఉన్నంతవరకు వైకాపాలోనే : విజయసాయి రెడ్డి

రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా వైఎస్ఆర్ సీపీ తరపున ఆ పార్టీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గురువారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తనకు మూడు తరాలుగా అనుబంధం ఉందని గుర్తు చేశారు. 
 
అదేసమయంలో తన ఊపిరి ఉన్నంతవరకు వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటానని స్పష్టంచేశారు. పార్టీ తరపున తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రాజ్యసభలో పార్టీ వాణిని వినిపిస్తానని విజయసాయి రెడ్డి తెలిపారు. అలాగే పార్టీ ప్రాబల్యం పెంచేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
 
అంతకుముందు విజయసాయి రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడానికి గల కారణాలను వైకాపా అధినేత జగన్ వివరించారు. తనపై అక్రమ కేసులు బనాయించి కష్టాలు పాల్జేసినప్పుడు విజయసాయిరెడ్డి తనకు అండగా ఉన్నారనీ, అందుకే ఆయనకు రాజ్యసభ టిక్కెట్ ఇస్తున్నట్టు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ రాజకీయాలు అంటే ప్రజా జీవితానికి సంబంధించినవన్నారు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ చేస్తున్న రాజకీయాలు దుర్మార్గమైనవని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబు అదే ఎమ్మెల్యేలను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు.
 
ఒక్క మాట కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చిందన్నారు. దీంతో తనపై అక్రమ కేసులు బనాయించారన్నారు. ఈ కేసుల్లో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని విజయసాయిపై ఒత్తిడి తెచ్చారని, కానీ సాయిరెడ్డి సత్యాన్ని నమ్ముకున్నారని, వాస్తవాలనే చెప్తానని స్పష్టం చేశారన్నారు. అందుకే తనపై కేసుల సందర్భంగా ఆయనను కూడా నిందితుడిగా చేర్చారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. చివరకు ఎన్ని ఒత్తిడులు ఎదురైనా సాయిరెడ్డి నైతిక విలువలకు కట్టుబడి, అండగా ఉన్నారన్నారు. విశ్వసనీయులకు సరైన స్థానం కల్పిస్తామనే సంకేతం పంపడానికే విజయసాయి రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించినట్లు జగన్ తెలిపారు.