బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (20:46 IST)

మానవత్వం కరువైంది... నా కుమార్తె కారుణ్య మరణానికి అనుమతివ్వండి...

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మానవత్వంకరువైంది. గర్భకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్యం చేసేందుకు మహిళా వైద్యురాలు ససేమిరా అంటోందని, అందువల్ల తన కుమార్తె కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ ఓ తల్లి ప్రాధేయపడుతుంది. ఇదే అంశంపై ఆమె రాష్ట్ర గవర్నర్‌కు ఓ లేఖ రాసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడకు చెందిన స్వర్ణలత అనే మహిళ కుమార్తె జాహ్నవి. ఈమెకు చిన్న వయసులోనే గైనిక్ సంబంధింత సమస్యలు తలెత్తాయి. పైగా, గత 15 యేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతూవస్తోంది. 
 
ఈ నేపథ్యంలో వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని గైనిక్ విభాగంలో ఆమెను చేర్చారు. అయితే, జాహ్నవికి వైద్యం చేసేందుకు మహిళా వైద్యురాలు నిరాకరించారని, కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చినా వైద్యురాలు పట్టించుకోలేదని స్వర్ణలత ఆరోపించారు. 
 
తన కుమార్తె ఉన్న దుస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నానని, అందువల్ల ఆమె కారుణ్య మరణానికి అనుమతించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. తన కూతురుకి వైద్యం అందిస్తారా? లేక కారుణ్య మరణానికి అనుమతిస్తారా? అంటూ ప్రశ్నిస్తూ స్వర్ణలత కన్నీటి పర్యంతమయ్యారు.