శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 27 మే 2017 (12:22 IST)

హెల్మెట్ లేదని బైకును అడ్డుకుంటే.. వివాహిత తలపై లారీ...

నడిరోడ్డుపై ఓ వివాహిత దుర్మరణం పాలైంది. ఈ ఘటనకు వాహనదారుల తప్పిదమో.. కానిస్టేబుల్ ఓవరాక్షన్ కారణమో తెలియరాలేదు. హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంగా హఠాత్తుగా ఓ కానిస్టేబుల్ వాహానాన్ని అడ్డగించడంతో.. అదుపు

నడిరోడ్డుపై ఓ వివాహిత దుర్మరణం పాలైంది. ఈ ఘటనకు వాహనదారుల తప్పిదమో.. కానిస్టేబుల్ ఓవరాక్షన్ కారణమో తెలియరాలేదు. హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంగా హఠాత్తుగా ఓ కానిస్టేబుల్ వాహానాన్ని అడ్డగించడంతో.. అదుపుతప్పిన ద్విచక్ర వాహనం రోడ్డుపై పడిపోయింది. దీంతో వాహనంపై ఉన్న వివాహిత కిందపడిపోయింది. ఆ సమయంలోనే ఓ లారీ ఆమె తలపై నుంచి వెళ్లింది.. అంతే తీవ్రగాయాలతో ఆ వివాహిత దుర్మరణం పాలైంది. ఈ దుర్ఘటన విశాఖలోని అక్కడిరెడ్డిపాలెంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. విశాఖ, కోరమండల్ గేట్ వద్ద అజంత కాలనీలో నివాసముంటున్న అంగ ఆనంద్, పద్మ దంపతులు శుక్రవారం ఉదయం ఆనందపురంలోని సంతోషిమాత ఆలయానికి బయలుదేరారు. దారిలో గాజువాక కానిస్టేబుల్ నాయుడు ఉన్నట్టుండి వారి బైకును ఆపాడు. హెల్మెట్ వాడలేదనే కారణంతో.. నాయుడు బైక్‌ను అడ్డుకున్నాడు.
 
కానీ బైక్‌ను ఉన్నట్టుండి అడ్డుకోవడంతో వాహనం అదుపు తప్పి దంపతులిద్దరు కిందపడిపోయారు. వెను వెంటనే వెనుక నుంచి వచ్చిన ఓ లారీ పద్మ తల పైనుంచి వెళ్లింది. దీంతో నడిరోడ్డు పైనే ఆమె దుర్మరణం పాలైంది. పద్మ దుర్మరణానికి కారణం కానిస్టేబుల్ దుందుడుకు వైఖరే కారణమని భావించిన స్థానికులు.. అతన్ని పట్టుకుని చితకబాదారు. వాహనాలు వేగంగా వెళ్లే జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించడమేంటని కానిస్టేబుల్‌ను నిలదీశారు.
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికులను నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా స్థానికులు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో మూడు గంటల పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. కాగా, కానిస్టేబుల్ ద్విచక్ర వాహనాన్ని అడ్డుకున్న సమయంలో వారి వద్ద హెల్మెట్ కూడా ఉంది. అయితే ఆనంద్ దాన్ని ధరించకపోవడంతో కానిస్టేబుల్.. బైక్‌ను అడ్డుకున్నాడు. అయితే ఊహించని రీతిలో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.