1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (09:26 IST)

వరంగల్ - సనత్ నగర్ రెండూ కావాలి... బీజేపీ నేతలకు టీడీపీ వినతి!

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ లోక్‌సభ, సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలపై తెలంగాణ టీడీపీ కన్నేసింది. ఈ రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశాన్ని తమకే కేటాయించాలని బీజేపీ నేతలను టీ టీడీపీ నేతలు కోరుతున్నారు. ఇదే అంశంపై ఇరు పార్టీల కీలక నేతలు ఆదివారం చర్చలు జరుపనున్నారు. 
 
త్వరలో ఉప ఎన్నిక జరుగనున్న వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఈ దఫా తమకివ్వాలన్న టీడీపీ నేతల ముందు బీజేపీ నేతలు కొత్త ప్రతిపాదన పెట్టారు. వరంగల్‌ సీటు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని, దానికి బదులు త్వరలో ఎన్నిక జరిగే అవకాశం ఉన్న సనత్‌నగర్‌ అసెంబ్లీ సీటును కేటాయించాలని వారు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. 
 
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజీనామాతో వరంగల్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే, టీడీపీ గుర్తుపై గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్‌ తర్వాత తెరాసలో చేరారు. పార్టీ ఫిరాయింపుల చట్టం మేరకు తలసాని శ్రీనివాస్ రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఆమోదిస్తే ఈ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. 
 
దీంతో రెండు స్థానాల పోటీపై టీడీపీ - బీజేపీ నేతల్లో చర్చ మొదలైంది. ఈ సారి తమకు పోటీ చేసే అవకాశం ఇస్తే బీజేపీ కంటే గట్టి పోటీ ఇవ్వగలుగుతామని టీడీపీ వర్గాలు గట్టిగానే వాదిస్తున్నాయి. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు బీజేపీ నేతలకు చెప్పారు. రెండు రోజుల క్రితం వరంగల్‌ జిల్లా బీజేపీ నేతలు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావును కలిశారు. ఆ తర్వాత టీడీపీ భేటీలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. 
 
ఇదే అంశంపై ఇరు పార్టీల నేతలు ఆదివారం సమావేశమై చర్చించనున్నారు. అదేసమయంలో సనత్‌నగర్‌ సీటును వదులుకోవడానికి టీడీపీ నేతలు సిద్ధంగా లేరనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇది టీడీపీ కంచుకోట. తమ పార్టీ గెలిచిన సీటు తాము వదులుకొనేది లేదని, వరంగల్‌లోనూ గట్టి పోటీ ఇవ్వడానికే తమకివ్వాలని కోరుతున్నామని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే బీజేపీ నేతలు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.