శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 3 ఆగస్టు 2017 (06:21 IST)

చిగురిస్తున్న 'జలాశ'లు.. జూరాలవైపు కృష్ణమ్మ పరుగులు

తెలుగు రాష్ట్రాలకు జలవార్త. ఆశలు వదిలేసుకుంటున్న తరుణలో కృష్ణమ్మ కర్నాటక జలాశయాలను దాటుకుని జూరాల వైపు పరుగులు తీస్తోంది. ఆగస్టు తొలి వారం వరకు తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల్లో చుక్కనీరు లేకుండా పోవడంతో రైతుల్లో భయాందోళనలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలక

తెలుగు రాష్ట్రాలకు జలవార్త. ఆశలు వదిలేసుకుంటున్న తరుణలో కృష్ణమ్మ కర్నాటక జలాశయాలను దాటుకుని జూరాల వైపు పరుగులు తీస్తోంది. ఆగస్టు తొలి వారం వరకు తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల్లో చుక్కనీరు లేకుండా పోవడంతో రైతుల్లో భయాందోళనలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు ఆలమట్టి, నారాయణపుర జలాశయాలను దాటుకుని వరద నీరు కిందికి ప్రవహించడంతో తెలుగు రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
 
ఎగువన వర్షాలు కురవడంతో ఆలమట్టి జలాశయం, నారాయణపుర జలాశయాలు నిండుకుండలయ్యాయి. కృష్ణమ్మ బిరబిరమంటూ ఆంధ్ర రాష్ట్రాల వైపు పరుగులు తీస్తోంది. నారాయణపుర జలాశయం నుంచి 18,199 క్యూసెక్కుల నీటిని జూరాల జలాశయానికి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నారాయణపురకు 25,301 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇప్పటికే జలాశయంలో 26.14 టీఎంసీ(గరిష్ఠం 26.97)ల నీరుంది. 
 
ఎగువన ఆలమట్టి జలాశయంలో పూర్తిస్థాయిలో 119. 26 టీఎంసీల అడుగుల నీరుంది. జలాశయానికి 35,672 క్యూసెక్కుల నీరు వస్తుండగా 18,388 క్యూసెక్కులు దిగువకు పంపుతున్నారు. పరిసర ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులున్నా ఎగువన కురిసిన వర్షాలకు డ్యాంలు భర్తీ కావడంపై రైతులు హర్షం వెలిబుచ్చారు.
 
ఎగువ ప్రాంతం నుంచి ప్రవహిస్తున్న నీటిని కర్నాటక ప్రభుత్వం ఒడిసిపట్టుకుని కాలువలకు మళ్లిస్తుండటంతో  జూలై చివరి వరకు నారాయణ పుర జలాశయం నుంచి చుక్కనీరు కిందికి రాలేదు. దీంతో ఈసారి చుక్కనీరు కూడా తెలుగు రాష్ట్రాలకు వచ్చే అవకాశం లేదని రైతులు భీతిల్లిపోయారు. ఆగస్టు 2న నారాయణ పుర నుంచి జూరాల జలాశయానికి నీటి  ప్రవాహం పయనించడంతో తెలుగు రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి.