బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 9 అక్టోబరు 2017 (20:20 IST)

త్వరలో సుందర నగరంగా నంద్యాల... భూమా బ్రహ్మానందరెడ్డి

కర్నూలు జిల్లాలోని నంద్యాలను త్వరలో సుందర నగరంగా తీర్చిదిద్దుతామని ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నూతన శాసనసభ్యుడు భూమా బ్రహ్మానందరెడ్డి చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన బాబాయి భూమా నాగిరెడ్డి మరణించిన తరువాత తమ కుటుంబానికి అండగా ఉండి, తనకు టిక్కెట

కర్నూలు జిల్లాలోని నంద్యాలను త్వరలో సుందర నగరంగా తీర్చిదిద్దుతామని ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నూతన శాసనసభ్యుడు భూమా బ్రహ్మానందరెడ్డి చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన బాబాయి భూమా నాగిరెడ్డి మరణించిన తరువాత తమ కుటుంబానికి అండగా ఉండి, తనకు టిక్కెట్ ఇచ్చి ఎన్నికల్లో గెలిపించిన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. 
 
తన విజయానికి సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలకు ధన్యవాదాలు తెలిపారు. తన బాబాయి ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఇప్పటికే నంద్యాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. నగరానికి దూరంగా కొంత భూమి కేటాయించి, అక్కడకు పందులను తరలించినట్లు చెప్పారు. రోడ్లను వెడల్పు చేయిస్తూ, పైప్ లైన్లను వేయిస్తున్నామన్నారు. 
 
రోడ్ల వెడల్పులో భూములు కోల్పోయినవారిలో కొందరికి నష్టపరిహారం కూడా చెల్లించినట్లు తెలిపారు. అభివృద్ధి విషయంలో ఏ విషయం చెప్పినా ముఖ్యమంత్రితోపాటు అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గానికి గృహనిర్మాణ పథకం కింద 13 వేల ఇళ్లు మంజూరు చేశామని, ఇప్పటికి 11 వేల మంది లబ్దిదారులు వారి భాగానికి సంబంధించి డీడీలు కూడా అందజేశారని బ్రహ్మానందరెడ్డి వివరించారు.