శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2015 (12:48 IST)

ఏపీ టీడీపీ ఎమ్మెల్యేకు రూ.1000 ఫైన్ విధించిన హైకోర్టు!

జిల్లా జడ్జితో పాటు న్యాయాధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికార టీడీపీ ఎమ్మెల్యేకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు వెయ్యి రూపాయల అపరాధం విధించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే కాక కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఈ అపరాధం విధించింది. 
 
ఈ ఆదేశ వివరాలను పరిశీలిస్తే పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు.. జిల్లా జడ్జితో పాటు న్యాయాధికారుల పట్ల దురుసుగా వ్యవహరించారని కేసు నమోదైంది. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యతిసేన్ గుప్తా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 
 
న్యాయమూర్తులపై దురుసుగా ప్రవర్తించడం ప్రజాప్రతినిధిగా మీకెంతవరకు సమంజసమని ధర్మాసనం ఎమ్మెల్యేను ప్రశ్నించింది. ఇది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే అవుతుందని, ఈ తరహా వైఖరి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కూడా పేర్కొంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు రూ.1000 జరిమానా కట్టాలని తీర్పు చెప్పింది. 
 
అయితే సదరు ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. అందుకు అంగీకరించిన కోర్టు, క్షమాపణను లిఖిత పూర్వకంగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.