మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (16:18 IST)

కర్నూలు జిల్లాలో మరో 'స్వాతి'.. ప్రియుడి మోజులో భర్త హత్య... కిరాయి రూ.లక్ష

ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన స్వాతి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను ఓ కుదుపు కుదిపింది.

ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన స్వాతి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను ఓ కుదుపు కుదిపింది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే హత్య చేయించిందో ఇల్లాలు. బ్రాహ్మణపల్లెలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన వడ్డె చిన్న మద్దలేటి అలియాస్ మద్దయ్య (35), తన అక్క కుమార్తె వెంకటేశ్వరమ్మను ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. రెండేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన ముల్ల మహబూబ్ బాషాతో వెంకటేశ్వరమ్మకు ఏర్పడిన పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
విషయం తెలిసిన మద్దయ్య భార్యను నిలదీశాడు. దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్రియుడు బాషాతో  కలిసి వెంకటేశ్వరమ్మ హత్యకు ప్లాన్ చేసింది. బేతంచెర్ల మండలంలోని బలపాలపల్లెకు చెందిన మనోహర్‌తో భర్త హత్యకు బేరం కుదుర్చుకుంది. లక్ష రూపాయలకు ఒప్పందం కుదరగా తొలుత రూ.80 వేలు అడ్వాన్స్‌గా చెల్లించింది. తమ ప్లాన్‌లో భాగంగా, మద్దయ్యకు మనోహర్ స్నేహితుడిగా మారాడు. 
 
దీంతో అపుడపుడూ వీరిద్దరూ కలిసి మద్యం పార్టీల్లో పాల్గొంటూ వచ్చారు. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీన మద్దయ్యను పూడిచెర్లకు వెళ్లి ఇద్దరూ మద్యం సేవించారు. మద్దయ్య మద్యం ఫుల్‌గా సేవించడంతో  మత్తులోకి జారుకున్నాడు. ఇదే అదునుగా భావించిన మనోహర్‌ తన స్నేహితుడైన బలపాలపల్లెకే చెందిన మల్లికార్జున్ సాయంతో మద్దయ్యను బండరాయి మోది హతమార్చాడు. 
 
దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా భార్య వెంకటేశ్వరమ్మను విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్య కేసు నమోదు చేసి నిందితులందరినీ అరెస్ట్ చేశారు.