శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (17:42 IST)

ప్రజావేదిక కూల్చివేత ఎఫెక్టు : మకాం మార్చే యోచనలో చంద్రబాబు

కృష్ణానది కరకట్టపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కూల్చివేయాల్సిందిగా ఆదేశించింది. ఇందులోభాగంగా, గత ప్రభుత్వం కరకట్టపై రూ.8.95 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రజావేదికను రెవెన్యూ అధికారులు బుధవారం పూర్తిగా కూల్చివేశారు. ముఖ్యంగా, ప్రజావేదిక కూల్చివేసిన తర్వాత తదుపరి చంద్రబాబు నివాసాన్ని కూల్చివేస్తారనే ప్రచారం సాగుతోంది.
 
ఈ ప్రజావేదిక పక్కనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంది. ఇది అక్రమ నిర్మాణమేనని, దాన్ని కూడా కూల్చి వేయాలంటూ వైకాపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పార్టీ నేతలతో బుధవారం సమావేశమయ్యారు. ఇందులో ప్రజావేదిక కూల్చివేతతోపాటు అక్రమ నిర్మాణాల కూల్చివేత తదితర అంశాలపై చర్చించారు. 
 
ఈ సమావేశంలో చంద్రబాబు తన మనసులోని మాటను వెల్లడించినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఉండవల్లి నివాసం నుంచి ఖాళీ చేసే యోచనలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది. అనువైన నివాసం దొరికిన వెంటనే, అక్కడి నుంచి ఖాళీ చేయాలని మెజార్టీ టీడీపీ నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. 
 
కాగా, చంద్రబాబు కొత్త ఇంటి కోసం పరిశీలనలో పలు గెస్ట్ హౌస్‌లు ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. క్వాలిటీ ఐస్ క్రీమ్ గెస్ట్‌హౌస్, గామన్ ఇండియా అతిథి గృహం, మరో గెస్ట్ హౌస్‌ను టీడీపీ నేతలు పరిశీలించినట్టు సమాచారం. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెం ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు కొందరు చంద్రబాబు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అలాగే పలువురు టీడీపీ నేతలు కూడా చంద్రబాబుకు ఇంటిస్థలం దానం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.