శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 3 మార్చి 2015 (16:20 IST)

బాబు దోచుకునే ప్రతి ఎకరా భూమిని తిరిగి ఇప్పిస్తా... జగన్ హామీ..!

ఆంధ్ర ప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే చంద్రబాబు ఇప్పుడు దోచుకునే ప్రతి ఎకరా భూమిని సదరు రైతులకు తిరిగి ఇప్పిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మంగళవారం గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఉండవల్లిలోని పంటపొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు, కౌలు రైతులు, కూలీలు, మహిళలు తమ గోడు జగన్‌కు చెప్పుకుని విలపించారు. 
 
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కోని, వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. భూములు కోల్పోయిన రైతులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక, ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న భూములను తిరిగి ఇచ్చేస్తామన్నారు. 
 
కేంద్రం కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రజలను నిరాశపరిచిందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను మర్చిపోయారని జగన్‌ ఆరోపించారు. కాగా, జగన్ పర్యటన ఉండవల్లి నుంచి ప్రారంభమైంది. రాజధాని ప్రాంతంలో ఉన్న రైతుల సమస్యలను జగన్‌ అడిగి తెలుసుకున్నారు.