మరొకరితో సన్నిహితంగా ఉన్నదనీ.. మరదలిని హత్య చేసిన బావ!
చిత్తూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. తన మరదలు వేరొకరితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని బావ.. కిరాతకుడిగా మారిపోయి మరదలిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
తంబళ్లపల్లె మండలం ఇట్నేనివారిపల్లిలోని టేకు మంద పాపన్న, రమణమ్మ కుమార్తె సుశీల అనే యువతి స్థానికంగా ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. రమణమ్మకు వరుసకు అన్న అయిన రమణ కుమారుడు సురేష్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
సురేష్, సుశీలకు మధ్య గత కొన్నినెలలుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే రెండు నెలలకు ముందు ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే సుశీల తన స్నేహితుడితో గత కొన్నిరోజులుగా సన్నిహితంగా మెలుగుతూ వస్తోంది.
దీన్ని జీర్ణించుకోలేని సురేష్ సుశీలను ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి దారుణంగా బండరాయితో కొట్టి, చున్నీతో మెడకు బిగించి హత్య చేసి పారిపోయాడు. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.