1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 నవంబరు 2019 (18:45 IST)

నవ్యాంధ్రలో ఆటోవాలాలకు ఇక పండగే... : మంత్రి నాని

రాష్ట్రంలో వైయస్సార్ వాహనమిత్ర పధకం ద్వారా ఈఏడాది రెండు విడతల్లో మొత్తం 2లక్షల 36వేల 343 మంది వివిధ వాహనదారులకు లబ్ది కలిగించడం జరుగుతోందని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, రవాణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు. ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీమేరకు తెల్లరేషన్ కార్డు కలిగిన ఆటోలు, టాక్సీ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్స్ యజమాని కం డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ మరియు వాహన మరమ్మత్తుల నిమిత్తం రూ.10 వేలు వంతున ఆర్ధిక సహాయం అందించేందుకు ప్రవేశపెట్టిన తొలి సంక్షేమ పధకం వైయస్సార్ వాహనమిత్ర పథకమని పేర్కొన్నారు. 
 
ఈ పథకం అమలుకై గత సెప్టెంబరులో జిఓ నంబరు 34,38ల ద్వారా విధివిధానాలను జారీ చేసి ఏలూరులో దీని అమలుకు శ్రీకారం చుట్టండం జరిగిందని తెలిపారు. ఈ పధకం అమలుకు రూ.400 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేయగా మొదటి విడతలో లక్షా 73వేల 102మందికి రూ.10 వేలు వంతున ఆయా వాహనదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా రెండవ విడతగా మరో 62వేల 637మందికి మీడియా సమావేశం నుండే వారి బ్యాంకు ఖాతాలకు ఆన్‌లైన్ ద్వారా నిధులు జమ చేశారు. 
 
వైయస్సార్ వాహన మిత్రపధకం కింద మొదటి విడతలో మొత్తం లక్షా 72 వేల 102 మందికి లబ్ది కలిగించగా వారిలో 39 వేల 805 మంది ఎస్సిలు, 6 వేల 23 మంది ఎస్టిలు, 79 వేల 21 మంది బిసిలు, 17 వేల 504 మంది మైనార్టీలు, 20 వేల 357 మంది కాపు, 397మంది బ్రాహ్మణ, 9 వేల 995 మంది ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన వారు లబ్ది పొందడం జరిగిందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 
 
రెండవ విడతలో భాగంగా అందిన దరఖాస్తుల్లో 62 వేల 637 మంది అర్హులుగా గుర్తించగా వారిలో 14 వేల 528 ఎస్సి, 2 వేల 714 ఎస్టి, 26 వేల 696 బిసి, 8 వేల 196 మైనార్టీ, 6 వేల 661 కాపు, 112 బ్రాహ్మణ, 3 వేల 487 ఇబిసి, 245 క్రిస్టియన్ మైనార్టీ వర్గాలకు చెందిన వారికి రూ.10 వేలు వంతున వారి బ్యాంకు ఖాతాలకు నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. 
 
వైయస్సార్ వాహనమిత్ర పథకం కింద రెండు విడతల్లో మొత్తం 2లక్షల 36వేల 343 మంది వాహనదారులకు ప్రయోజనం కలిగించేందుకు ఈ ఏడాది ఇప్పటికే రూ.236 కోట్లు వారి ఖాతాలకు జమ చేయడం జరిగిందని చెప్పారు. అర్హులైన వారందరికీ ఈ పధకం కింద లబ్ది కలిగించేందుకు వచ్చే ఏడాది కూడా ఈపధకాన్ని కొనసాగించడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. 
 
వైయస్సార్ వాహనమిత్ర పథకాన్ని తీసుకవచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి పేర్నినాని ప్రత్యేకంగా కృతజ్ణతలు తెలిపారు. అలాగే రవాణా శాఖకు చెందిన మోటర్ వాహన ఇన్‌స్పెక్ట‌ర్ మొదలు ముఖ్య కార్యదర్శి వరకూ జిల్లా కలెక్టర్లు, ఎండిఓలు, మున్సిపల్ కమీషనర్లు తదితర అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పధకం విజయవంతానికి బాగా పనిచేశారని వారందరికీ ప్రభుత్వం తరపున ప్రత్యేక అభినందలు తెలిపారు. సమావేశంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, రవాణాశాఖ కమీషనర్ టిఎస్ఆర్ ఆంజనేయులు, సంయుక్త కమీషనర్లు ఎస్.ప్రసాదరావు, జె.రమాశ్రీ తదితరులు పాల్గొన్నారు.