1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2019 (08:34 IST)

మహిళలకు 50శాతం రిజర్వేషన్‌.. ఖంగుతిన్న వైఎస్సార్‌సిపి నేతలు

జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ, మార్కెటింగ్‌ కమిటీల ఛైర్మన్‌ పదవులలో 50శాతం మహిళలకు రిజర్వేషన్‌ కల్పించటంతో ఇంతవరకు ఆ పదవులను ఆశించిన వైఎస్సార్‌సిపి నేతలు ఖంగు తిన్నారు.

ఆ పదవులు తమకు దక్కకపోయినా తమ సతీమణులకైనా ఇవ్వాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను స్వయంగా కలిసి విన్నవించుకుంటున్నారట.
 
 రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన మార్కెట్‌ కమిటీల ఛైర్మన్‌ పదవుల కోసం ప్రయత్నించిన ద్వితీయ శ్రేణి నాయకులు, ఎన్నికలలో పోటీ చేసే అవకాశం రాని వారు ఆయా పోస్టుల కోసం తమ సతీమణులకు అవకాశం ఇవ్వాలని సిఎం జగన్‌కు సన్నిహితంగా ఉండే మంత్రులు, పార్టీ ముఖ్యనేతలను కలిసి విన్నవించుకుంటున్నారట. ఈ మాసాంతంలోపు వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఛైర్మన్‌ పదవులు, డైరెక్టర్‌ పదవులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు జారీ చేయటంతో కమిటీల నియామకాలకు రంగం సిద్దం కాబోతోంది.
 
ఇప్పటికే అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో ఇంఛార్జి మంత్రులు సమావేశం నిర్వహించటం జరిగింది. ఎవరెవరిని కమిటీ ఛైర్మన్‌గా నియమించాలి అనే విషయంపై ఒక జాబితాను రూపొందించటం జరిగింది. అందులో ఛైర్మన్‌ పదవులకు ఒక పేరును సూచించకుండా రెండు, మూడు పేర్లతో ఒక జాబితాను తయారు చేసి, ముఖ్యమంత్రి జగన్‌తో చర్చించాక వారిలో ఎవరో ఒకరిని ఛైర్మన్‌గా నియమించే అవకాశాలున్నాయట.

ఆదాయం ఎక్కువగా వచ్చే మార్కెట్‌ కమిటీలకు పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. వారిలో కొందరు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని, మరి కొందరు ముఖ్యమంత్రి సలహాదారులను, మంత్రులను కలిసి వారిపై ఒత్తిడి తెస్తున్నారట. ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారట.

తమది కేవలం ప్రేక్షక పాత్రే అని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇంఛార్జి మంత్రులే మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవులపై నిర్ణయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతా మంటున్నారు మంత్రులు. ఏయే మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవులు ఎవరికి ద్కనున్నాయనేది వేచి చూడాల్సిందే.