1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 21 డిశెంబరు 2019 (11:35 IST)

అబ్బే తూఛ్.. నేను అలా అనలేదు... వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి

ఏపీకి మూడు రాజధానులు సరైన నిర్ణయం కాదని తొలుత వ్యాఖ్యానించిన వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇపుడు యూటర్న్ తీసుకున్నారు. తన మాటలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయంటూ వివరణ ఇచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, నేను మాట్లాడినదానికి తల, తొక తీసేసి కొన్ని పార్టులు, పార్టులుగా విడగొట్టి ప్రసారం చేశారు. దానిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం విడిపోయాక హైద్రాబాద్‌ నగరాన్ని మన కోల్పోవడం జరిగింది. దీనివల్ల ఎన్ని నష్టాలు జరిగాయే ప్రజలకు తెలుసు. కేంద్ర సంస్థలన్నీ కూడా హైద్రాబాద్‌‌లో పెట్టడం వల్ల పెట్టుబడులు అక్కడకే వచ్చి సెంట్రలైజేషన్‌ జరిగి మిగిలిన ప్రాంతం నిర్లక్ష్యం కాబడి అభివృధ్ది అంతా కూడా అక్కడే జరిగింది.
 
 
ఉత్తరాంధ్రగాని, రాయలసీమగాని వెనకబడిన జిల్లాలు దాదాపు ఏడు ఉన్నాయి. సెంట్రలైజేషన్‌ జరిగి విభజన తర్వాత హైద్రాబాద్‌ నగరాన్ని కోల్పోవడం వల్ల మనం ఓ గుణపాఠం నేర్చుకున్నాం. అది తెలుసుకుని వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణన్‌ కమిటి కూడా చెప్పింది. ముఖ్యమంత్రిగారు అసెంబ్లీలో కూడా అదే చెప్పారు. ఆ ప్రకటనలో భాగంగా లెజిస్లేచివ్‌ కేపిటల్‌ అమరావతిలోను, కర్నూలులో జ్యుడిషయల్‌ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ ఏర్పాటు చేయాలనే దిశగా ఏం చెప్పారో దానికి ఏకీభవిస్తున్నాను.
 
50 ఏళ్లుగా ఉత్తరాంధ్ర వెనకబాటుతనంతో ఉంది. అక్కడ గమనిస్తే ఇంకా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందిపడటం మనం చూస్తున్నాం. వాటిని కూడా మనం అభివృధ్ది చేసుకోవాలి. ఆ విధంగా చేసిన ముఖ్యమంత్రి ప్రకటనను మేం స్వాగతిస్తున్నాం. హర్షం వ్యక్తం చేస్తున్నాను. అమరావతిని తీసుకుంటే చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చాక జులైలో ప్రమాణస్వీకారం చేశారు. 
 
డిసెంబర్‌ రాజధాని ప్రకటన చేసేవరకు షుమారు నాలుగువేల ఎకరాలు టిడిపి నేతలు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాద్‌ రెడ్డి అసెంబ్లీలో వివరాలతో సహా ప్రకటించడం జరిగింది. ఇన్‌‌సైడర్‌ ట్రేడింగ్‌‌కు పాల్పడ్డారని కూడా తెలియచేశారు. ఈ విధంగా రాజధానిలో నాలుగువేల ఎకరాలు కొనడమే కాదు. లంక భూములు 500 ఎకరాలు తన బినామిలకు ప్లాట్లు కేటాయించి వారి అనుచరులకే లబ్ది చేకూరేవిధంగా చేశారు.
 వారి పొలాలనుంచి వెళ్లే విధంగా రింగ్‌ రోడ్డు డిజైన్‌ చేశారు.
 
అదేవిధంగా అమరావతిలో ఇంత అవినీతి, భూములను సొంతవారికి కట్టబెట్టుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లబ్దిచేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్యుడు అమరావతిలో ఉండాలన్నా చాలా ఇబ్బంది కరమైన పరిస్దితి నెలకొంది. అసలే ఏపి చంద్రబాబు రాష్ట్రాన్ని 3.62 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకువెళ్లారు. నేడు తిరిగి రెండు లక్షల కోట్లతో రాజధాని ఏర్పాటుచేసుకోవాలంటే చాలా ఇబ్బంది. అంత పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టి అభివృధ్ది చేసుకునేకన్నా అన్ని ప్రాంతాలు అభివృద్ది చేసుకునేవిధంగా చేయడం మంచిది. 
 
పెట్టుబడులు కావాలంటే వికేంద్రీకరణ జరగాలి. ఒకేచోట అభివృద్ది జరిగితే నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి వికేంద్రీకరణ అవసరం. ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను అందరూ అర్దం చేసుకుని మద్దతు పలకాలి. నేను కూడా పార్టీ పెట్టిన దగ్గర నుంచి వైయస్‌ జగన్‌ అడుగుజాడలలో నడుస్తున్నాను. ఆయన  తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను అంటూ మీడియా ముఖంగా స్పష్టతనిచ్చారు.