బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2020 (12:32 IST)

సీఎం జగన్ మగాడు.. మొనగాడు అనుకున్నా.. కానీ.. : ఆర్ఆర్ఆర్

ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వైకాపాకు చెందిన నరసాపురం రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ మగాడు.. మొనగాడు అనుకున్నా.. కానీ, ఈ రకంగా స్థాయిని తగ్గించుకుని నడుచుకుంటారని తాను కలలో కూడా ఊహించుకోలేదన్నారు. 
 
ఢిల్లీలో పార్లమెంట్ వెలుపల రఘురామకృష్ణంరాజు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, 'ప్రజాకంటకంగా ఉంటే.. ప్రజలు, ప్రజాప్రతినిధులు అడ్డం కొట్టే పరిస్థితి వస్తుంది. అమరావతిపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోండి. మన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించండి. ఎవరికీ ఇబ్బంది లేకుండా న్యాయం చేయండి. గతంలో నేను చెప్పినట్టుగానే నాపై కొన్ని కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. నన్ను చంపేస్తానని చెప్పిన వ్యక్తితోనే కేసులు పెట్టిస్తున్నారు. 
 
నాకు తెలిసిన జగన్ రెడ్డి ఎంతో ధైర్యవంతుడు. ఆయన మగాడు.. మొనగాడు అనుకున్నాను. ఈ రకంగా స్థాయి తగ్గించుకుంటాడని అనుకోలేదు. ఉన్నతంగా ఉండాలని అనుకునేవాడిని... మీకు మీరు తగ్గించేసుకుంటారని అనుకోలేదు. నాస్థాయి పెరుగుతుంది. ఇంకా పెరుగుతుంది. మీ స్థాయి తగ్గడం బాధగా ఉంది. మీ స్థాయిని తగ్గించుకోకండి. ఏదైనా ఉంటే ముఖాముఖి మాట్లాడుకుందాం. మీరు ప్రయోగించిన వాళ్లు చిన్నవాళ్లు కాదు. బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. ప్రజల దృష్టిలో మీరు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని ఆర్ఆర్ఆర్ ముగించారు.