1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (07:23 IST)

మింగ మెతుకులేదుగానీ... మీసాలకు సంపెంగ నూనె కావాలట... సాయిరెడ్డి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిపతి (ముఖ్యమంత్రి) అవుతాడంటూ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే బీజేపీ శ్రేణులు మాత్రం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. మింగ మెతుకులేదు... మీసాలకు సంపెంగ నూనె కావాలని అడిగాడట ఓ వ్యక్తి.. అలావుంది సోము వీర్రాజు వ్యాఖ్యలు అని అన్నారు. ఒక్క సీటులో కూడా గెలవలేనివాడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడంట అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సందర్భంగా ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అధిపతి అవతాడు అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటలను సోము వీర్రాజు మీడియా ద్వారా వెల్లడించారు. 
 
అయితే, ఇందుకు వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇదే విషయం పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జరుగుతున్నది తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక అని వ్యాఖ్యానించారు. అయితే కాబోయే సీఎం ఫలానా అంటూ బిస్కెట్ వేయడంకాక మరేమిటి అంటూ ఎద్దేవా చేశారు. 
 
ఆఫర్ చేసే పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు లేదు అని, దానిని తీసుకొనే పార్టీకి ఉనికి లేదంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్స్ వేశారు. 'జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట' అంటూ ఎద్దేవా చేశారు. 'ఎమ్మెల్యే కూడా కానివాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట' అంటూ చెప్పుకొచ్చారు. 
 
అయితే, ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాక గతంలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు.