శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (16:04 IST)

ఇరిగేషన్ పనులకు రూ.లక్ష కోట్లు కేటాయింపు : ఆదాల ప్రభాకర్ రెడ్డి

రాష్ట్రంలోని ఇరిగేషన్ పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల రూపాయలు కేటాయించారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నీటి పారుదల ద్వారా రైతుల జీవితాన్ని బాగు చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. 
 
కందుకూరు నియోజకవర్గంలోని ఓలేటి వారి పాలెం గ్రామంలో ఈ- పాస్బుక్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది .స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డితో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకున్నారని తెలిపారు. 
 
ఆరు నెలల్లో నవరత్నాల రూపంలో వాగ్దానాలను అమలు చేశారని పేర్కొన్నారు. ఎంత ఆర్థిక భారం ఎదురైనప్పటికీ దాన్ని లెక్కచేయలేదని గుర్తు చేశారు. ఇక ముందు మరింత అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాల్లో పరిపాలనను పటిష్టం చేయడానికి గ్రామ సచివాలయలను ఏర్పాటు చేశారని తెలిపారు. 
 
గతంలో కనివిని ఎరుగని విధంగా నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారని కొనియాడారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన దానికంటే కూడా జగన్ ఇంకా ముందుకు వెళుతున్నారని ప్రశంసించారు. పాలనలో అవినీతికి తావులేకుండా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి నిక్కచ్చి మనిషి అని, మంత్రిగానూ పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు. ఆయన మరిన్ని సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
ఈ కార్యక్రమంలో స్థానిక రైతులకు ఈ పాస్ పుస్తకాలు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి తహసిల్దార్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి స్వర్ణ వెంకయ్య పాముల హరి సుధాకర్ రెడ్డి డాక్టర్ సునీల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.