శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. పర్యాటక రంగం
  3. ఏపీ టూరిజం
Written By chj
Last Modified: గురువారం, 13 జులై 2017 (20:14 IST)

కొండ‌ప‌ల్లి ఖిల్లాకు కొత్త క‌ళాకాంతులు... రూ.4కోట్ల వ్య‌యంతో హంగులు(ఫోటోలు)

అమరావతి : కొండపల్లి కోట ఇక పర్యాటకులకు మరింతగా కనువిందు చేయనుంది. ఎంతో చారిత్రక నేపధ్యం కలిగిన ఈ కోటకు వచ్చే పర్యాటకులకు అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకునేందుకు పర్యాటక శాఖ సిద్దం అవుతోంది. ఈ పర్యాటక మజిలీ ఇప్పటి వరకు సాధారణ దర్శనీయ కేంద్రంగా ఉం

అమరావతి : కొండపల్లి కోట ఇక పర్యాటకులకు మరింతగా కనువిందు చేయనుంది. ఎంతో చారిత్రక నేపధ్యం కలిగిన ఈ కోటకు వచ్చే పర్యాటకులకు అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకునేందుకు పర్యాటక శాఖ సిద్దం అవుతోంది. ఈ పర్యాటక  మజిలీ ఇప్పటి వరకు సాధారణ దర్శనీయ కేంద్రంగా ఉండగా, భవిష్యత్తులో పర్యాటకులు ఇక్కడే ఒకటి, రెండు రోజులు బస చేయగలిగేలా వినూత్న కార్యక్రమాల సమాహారాన్ని ఇక్కడ ఏర్పటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. వెలగపూడి సచివాలయంలో కొండపల్లి కోట అభివృద్ది ప్రణాళికపై గురువారం పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ప్రత్యేక సమావేశం ఏర్పటు చేసారు. 
 
పురాతన, పురావస్తు ప్రాధన్యత కలిగిన ఈ తరహా కట్టడాలను అభివృద్ది చేయటంలో అనుభవం కలిగిన కన్సల్టెంట్ల సేవలను ఇందుకోసం వినియోగించుకోవాలని నిర్ణయించారు. సమావేశంలో ఎపిటిడిసి ఎండి హిమాన్హు శుక్లాతో పాటు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఇన్క్లూసివ్ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ అచార్య అమరేశ్వర్ గల్లా తదితరులు పాల్లోన్నారు. ఈ సందర్భంగా పర్యాటక కార్యదర్శి మీనా మాట్లాడుతూ ఆధునీక‌త పేరిట కోట వాస్తవికతను దూరం చేయకుండా పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళిక ఉండాలన్నారు.
 
అంతర్జాతీయ స్ధాయిలో సైతం విస్తృత ఆదరణ పొందిన కొండపల్లి బొమ్మలకు సంబంధించి మరింత విలువైన సమాచారం పర్యాటకులకు అందేలా  చర్యలు తీసుకోవాలసి ఉందన్నారు. ఖిల్లాను సందర్శించే వారు కొండపల్లి బొమ్మల విభాగంలో కనీసం ఒక పూట ఉండగలిగేలా అక్కడి పరిస్ధితులతో మార్పు ఉండాలని తదనుగుణంగా ప్రణాళిక రూపుదిద్దుకోవాలని సూచించారు. సాంస్కృతిక వారసత్వ పర్యాటక  భరితమైన ఈ ప్రాంతాన్ని సౌకర్యభరితంగా తీర్చిదిద్దగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్ధాయి పర్యాటకుల రాకను ఆశించవచ్చన్నారు. 
 
ప్రస్తుత కార్యచరణను అనుసరించి కోట ప్రాంతంలో ఎకో మ్యూజియం ఆసియాలోనే తొలిసారిగా ఓపెన్ ఎయిర్ మ్యూజియంలను ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రాధమికంగా ఒక అంగీకారానికి వచ్చారు. అయితే పూర్తి స్ధాయి మాస్టర్ ప్లాన్ను త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఆమోదం తదుపరి కార్యాచరణను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ తొలిదశలో రూ.4కోట్ల అంచనా వ్యయంతో పర్యాటకులకు అవసరం అయిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్దం చేసామన్నారు.
 
ఈ నెల 19వ తేదీన జ‌ర‌గ‌నున్న ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయిడు అధ్య‌క్ష‌త‌న  ప‌ర్యాట‌క సాంస్కృతిక వార‌స‌త్వ బోర్డు స‌మావేశం జ‌ర‌గ‌నుండ‌గా ఈఅంశాన్ని ఆయ‌న‌ దృష్టికి తీసుకు వెళ్లి, ఆమోదం మేర‌కు ప‌నులు ప్రారంభిస్తామ‌న్నారు. ఈ నిధులతో మాస్టర్ ప్లాన్ రూపకల్సనతో పాటు, ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో సర్వహంగులు సమకూరుతాయన్నారు. కోటను ప్రతిబింబింపచేసే విద్యుత్ వెలుగులు, మ్యూజియంతో పాటు చారిత్రక కోటల పూర్తి సమాచారంతో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తామని మీనా వివరించారు. పర్యాటకులకు అవసరమైన పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాలు, అల్పాహారశాల వంటివి ఏర్పాటు కానున్నాయి. 
 
మీనా మాట్లాడుతూ మరింత లోతుగా అధ్యయనం చేయాలని, ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లిపోయేలా కాకుండా వారు రెండు రోజుల పాటు అక్కడ ఉండగలిగేలా కార్యక్రమాలు, వసతుల ఏర్పటును కూడా దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయి డిపిసి సిద్ధం చేయాలన్నారు. కోటకు సంబంధించిన పూర్తి   సమాచారం కోసం అవసరమైతే విశ్వవిద్యాలయ చరిత్ర ఆచార్యులను కూడా సంప్రదించాలని సూచించారు.