1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 29 ఆగస్టు 2023 (14:45 IST)

అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో భూభాగంగా కొత్త మ్యాప్ విడుదల చేసిన చైనా

Modi-ChinaPM
చైనా తమ దేశం కొత్త మ్యాప్‌ను సోమవారం విడుదల చేసింది. ఇది తమ దేశ ‘‘ప్రామాణిక మ్యాప్’’గా చైనా చెప్పింది. ఈ మ్యాప్‌లో మరోసారి అరుణాచల్‌ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను తమ సొంత ప్రాంతాలుగా చైనా చెప్పుకుంది. చైనా విడుదల చేసిన ఈ మ్యాప్‌లో, దక్షిణ చైనా సముద్ర ప్రాంతం, తైవాన్‌లను కూడా తనలో భాగంగానే పేర్కొంది. ‘‘చైనా 2023 ప్రామాణిక మ్యాప్‌ను సోమవారం విడుదల చేసింది. సహజ వనరుల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌పై ఈ మ్యాప్‌ను లాంచ్ చేసింది. చైనా, ప్రపంచంలోని ఇతర దేశాల మ్యాప్ డ్రాయింగ్ విధానాలకు అనుగుణంగా దీన్ని రూపొందించింది’’ అని చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ పత్రికగా చెప్పే ఇంగ్లీష్ పత్రిక గ్లోబల్ టైమ్స్ తన సోషల్ మీడియాలో రాసింది.
 
చైనా విడుదల చేసిన ఈ కొత్త మ్యాప్‌పై బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి వ్యంగ్యంగా స్పందించారు. ‘‘మోదీకి చెప్పండి, కొన్ని ఒత్తిళ్ల చేత భారతమాతను మీరు కాపాడలేకపోతే, కనీసం ఆ పదవి నుంచి తొలగి, మార్గదర్శక్ మండల్‌కి వెళ్లండి. అబద్ధాలతో భారత్‌ను కాపాడలేరు. మరో నెహ్రూను భరించే ఓపిక భారత్ వద్ద లేదు’’ అని సుబ్రమణియన్ స్వామి అన్నారు.
 
బ్రిక్స్ సమావేశాల కోసం ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమైన నేపథ్యంలో చైనా ఈ కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. సరిహద్దు వివాదంపై ఇరు దేశాల అధినేతలు ఈ సమావేశంలో చర్చించారు. అంతకుముందు 2023 ఏప్రిల్‌లో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 11 ప్రాంతాల పేర్లను మార్చేందుకు చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 90 వేల చదరపు కి.మీల భూమిని తనదేనని చైనా చెప్పుకుంటోంది. పశ్చిమంలో ఉన్న అక్సాయ్ చిన్‌కి చెందిన 38 వేల చదరపు కి.మీ ప్రాంతాన్ని కూడా చైనా అక్రమంగా స్వాధీనం చేసుకుందని భారత్ చెబుతోంది.