1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 25 ఫిబ్రవరి 2021 (09:09 IST)

అమ్మ స్తనంపై పాము కాటు.. బిడ్డకు పాలిస్తుండగా ఘటన, మృతి - ప్రెస్ రివ్యూ

చిన్నారికి పాలిస్తుండగా రొమ్ముపై పాము కాటేడయంతో ఓ తల్లి మరణించినట్లు ఈనాడు పత్రిక కథనం ఇచ్చింది. ‘మహారాష్ట్ర చంద్రాపూర్‌ మండలం సోనాపూర్‌ నుంచి కొందరు కూలీలు కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని ఊటుకూరు వచ్చారు. మిరప కోతలకు వెళుతూ గ్రామంలోని బీసీ కాలనీ పాఠశాల దగ్గర గుడారంలో ఉంటున్నారు.

 
మంగళవారం రాత్రి అందరూ నిద్రపోతుండగా, పాప ఆకలితో ఏడ్చింది. దీంతో తల్లి శృతి ప్రమోద్‌ భోయర్‌ (21)కు బిడ్డకు తన పాలిచ్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ పాము ఆమె రొమ్ముపై కాటేసింది. పాము బిడ్డను కూడా కాటేస్తుందేమో అనే భయంతో ఆమె దాన్ని చేతితో పట్టుకుని విసిరేశారు. దీంతో కొద్ది దూరంలో నిద్రిస్తున్న రూపేష్‌ ప్రకాష్‌ చప్డే అనే యువకుడిపై పడిన పాము అతడిని కూడా కాటేసింది.

 
వారిని వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. శృతి చనిపోయారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. శృతి మృతదేహానికి పరీక్ష పూర్తయ్యాక బంధువులు స్వస్థలానికి తీసుకెళ్తార’’ని ఈనాడు కథనం వెల్లడించింది.