శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By కుమార్
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (18:17 IST)

అప్పుడు మాల్యా కార్లు వేలం... ఇప్పుడు నీరవ్ కార్ల వంతు

పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు నీరవ్‌ మోడీపై మరో దెబ్బ పడింది. నీరవ్ మోడీకి చెందిన కార్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) వేలం వేయనుంది. ఆయనకు చెందిన 13 కార్లను వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 18వ తేదీన వేలం వేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనకు సంబంధించిన పెయింటింగ్స్‌ని వేలం వేయగా రూ.54.84 కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే.
 
ఏప్రిల్‌ 18న నీరవ్‌కు చెందిన అత్యంత విలాస వంతమైన కార్లను ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకానికి ఉంచనున్నారు. రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌, పనామెరా, టొయోటా ఫార్చునర్‌, ఒక ఇన్నోవా, రెండు మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లు, మూడు హోండా కార్లు తదితర కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లు వీటిలో ఉన్నాయి. కార్లు అన్నీ మంచి కండీషన్‌లోనే ఉండటంతో ఇవి మంచి ధర పలుకుతాయని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ వేలాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం మెటల్‌ స్క్రాప్‌ ట్రేడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎంఎస్‌టీసీ)కు కాంట్రాక్టు ఇచ్చింది.
 
వేలంలో కార్లను కొనాలనుకునే వారు ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. కార్లు కొనాలనుకునే వారు కార్లను పరిశీలించవచ్చు కానీ టెస్ట్‌ డ్రైవ్‌ చేయడానికి కుదరదు. కార్ల అంచనా ధర, తయారీ సంవత్సరం, కారు మోడల్‌, ఫొటోలు, ఇతర డాక్యుమెంట్లను ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్లో ఉంచనున్నారు. వేలం పూర్తయిన తర్వాత కార్ల రిజిస్ట్రేషన్‌ కోసం కొంత గడువు ఇస్తారు.