శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మార్చి 2020 (15:12 IST)

స్టాక్ మార్కెట్లు భారీగా పతనం.. ఆర్థిక మాంద్యం తప్పదా?

ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ మరోమారు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా, బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీతో పాటు నిఫ్టీ తీవ్ర నష్టాలను చవిచూసింది. ఒకవైపు కరోనా వైరస్ భయంతో పాటు.. మరోవైపు, క్రూడ్‌ ఆయిల్‌ ధరల పతనం ఫలితంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో గురువారం 3,100 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్‌, 930 పాయింట్లకుపైగా నష్టాల్లో నిఫ్టీ కొనసాగుతోంది. అన్ని రంగాల సూచీలు 52 వారాల కనిష్ట స్థాయిలో ట్రేడవుతున్నాయి. 7-8 శాతానికి పైగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు నష్టపోయాయి. 10 శాతానికి పైగా బ్యాంకు నిఫ్టీ నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల పతనం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. 
 
ఇటు గ్లోబల్ మార్కెట్ల ప్రభావం.. ఆసియా మార్కెట్లపై పడింది. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. గురువారం సెన్సెక్స్‌, నిఫ్టీ గ్యాప్‌ డౌన్‌ ఓపెనింగ్‌‌తో మదుపర్లు కుదేలయ్యారు. హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు ఫ్లాట్‌ లో కొనసాగుతుండగా.. ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, బ్రిటానియా, బజాజ్‌ ఫినాన్స్‌, హీరో మోటార్‌కార్ప్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 
 
మరోవైపు, బంగారం ధరలు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. డాలరు బలహీనత, మార్కెట్ డిమాండ్ తగ్గిన కారణంగా ముంబైలో బంగారంలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. గత ఐదునెలల కనిష్టానికి డిమాండ్ తగ్గడంతో డీలర్లు డిస్కౌంట్ ఇస్తుండడం వల్ల ఇలా జరిగింది. అయితే ఈ ధర తరుగుదల తాత్కాలికమేనని వ్యాపార సంఘాలవారు అంటున్నారు. 
 
కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తుండడం, రూపాయి బలహీన పడడం వంటి కారణాలతో గుడిపాడ్వా లేదా అక్షయ తృతీయ నాటికి బంగారం మళ్లీ పుంజుకుని 50 వేల మార్కును తాకవచ్చని అంచనా వేస్తున్నారు.
 
ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశం ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేయడం కరోనా కరాళ నాట్యానికి అద్దం పడుతున్నది. మరోవైపు మాంద్యం నీడలు విస్తరిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం లేదా కరోనా వంటి మహమ్మారి విజృంభించిన ప్రతిసారీ బంగారం వైపు చూడడం మదుపరులకు అలవాటేనని మార్కెట్ పరిశీలకులు అంటున్నారు. 
 
కరోనా మహమ్మారి అదుపులోకి వస్తున్న సూచనలు కనిపించడం లేదు. మరోవైపు చమురు సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకున్నది. ఈ పరిస్థితుల్లో బంగారం ఒక్కటే నమ్మదగిన ప్రత్యామ్నాయంగా మదుపరులు భావించడం సహజమే.