శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (10:48 IST)

ఇండిగో సంస్థకు ఏమైంది.. విమాన సర్వీసులు నిలిపివేత...

దేశంలో చౌక ధరకు విమాన ప్రయాణ సేవలు అందిస్తున్న ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఇండిగో ఒకటి. ఈ సంస్థ సోమవారం అనేక విమాన సర్వీసులను నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకేసారి ఏకంగా 30కి పైగా సర్వీసులను నిలిపివేయడంతో ఏం జరిగిందోనన్న ఆందోళనలో ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానాల్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. 
 
సోమవారం రద్దు చేసిన విమాన సర్వీసుల్లో హైదరాబాద్, చెన్నై, జైపూర్ విమానాశ్రయాల నుంచి వివిధ నగరాలకు రాకపోకలు సాగించే విమానాలు ఉన్నాయి. హైదరాబాద్ విమానాశ్రయంలో 6, చెన్నైలో 8, జైపూర్ నగరంలో 3 విమాన సర్వీసులను ఆకస్మికంగా రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. విమాన సిబ్బంది కొరత వల్లనే తాము విమానసర్వీసులను రద్దు చేశామని ఇండిగో వెల్లడించింది. 
 
విమాన పైలెట్లు యేడాదికి వెయ్యి గంటలు మాత్రమే నడపాలని, తమ పైలెట్లు దాన్ని అధిగమించారని సమాచారం. కాగా మంచు కురుస్తూ వాతావరణం సరిగా లేనందువల్లే విమానసర్వీసులను రద్దు చేశామని ఇండిగో తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఉత్తరభారతదేశంలో మంచు కురుస్తున్నందువల్ల 11 ఇండిగో విమానాలను దారి మళ్లించామని అధికార ప్రతినిధి చెప్పారు. విమాన సర్వీసుల రద్దుతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలోనూ ఆ సంస్థ విఫలమైందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.