శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 20 జనవరి 2019 (13:14 IST)

ట్రాయ్‌ నిర్ణయంపై గరం.. గరం.. 24 నుంచి టీవీ ప్రసారాలు బంద్

టెలికామ్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) అమలులోకి తెచ్చిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ దక్షిణ భారత కేబుల్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఈనెల 24న బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‍లో భాగంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా దక్షిణ భారత వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కేబుల్‌ ప్రసారాలను రద్దు నిలిపివేస్తామని ప్రకటించింది. 
 
తద్వారా కర్ణాటకలోని 80 లక్షలకు పైగా కేబుల్‌ ప్రసారాలకు బ్రేక్‌ పడనుందని కర్ణాటక రాష్ట్ర కేబుల్‌ ఆపరేటర్‌ల సంఘం అధ్యక్షుడు ప్యాట్రిక్‌ రాజు వెల్లడించారు. శనివారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రాయ్‌ కొత్త నిబంధనలు కేబుల్‌ ఆపరేటర్‌లకు నష్టం కలిగించడంలేదని అయితే విభిన్నమైన ప్యాకేజీలతో ప్రేక్షకులకు భారం కానుందని తెలిపారు. 
 
ఇంతకుముందు నగరాలలో రూ.300, గ్రామీణ ప్రాంతాల్లో 150 రూపాయలకే 400కుపైగా చానళ్లు ప్రసారం చేస్తున్నామన్నారు. ట్రాయ్‌ కొత్త నిబంధనల ప్రకారం జీఎస్టీతో కలిపితే 154 రూపాయలు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అనంతరం వారికి ఇష్టమైన చానళ్లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. 
 
ఉచితంగా ప్రసారమయ్యే వంద చానళ్లలో 24 దూరదర్శన్‌ చానళ్లే ఉన్నాయన్నారు. ప్రస్తుతం కేబుల్‌ ఆపరేటర్‌ అందిస్తున్న చానళ్లను వీక్షించాలంటే కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు 1000 రూపాయలు దాటుతుందన్నారు. అందుకే నిబంధనలు సవరించాలని డిమాండ్‌ చేస్తున్నామని తెలిపారు.