శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (15:09 IST)

ఇకపై జియో ఫైబర్ సేవలు... ఇంట్లోని బుల్లితెరపైనే కొత్త సినిమా

రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. ఒకవైపు జియో మొబైల్ సేవలతో దూసుకెళ్తుంటే.. మరోవైపు జియో ఫైబర్ సేవలను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించారు. సోమవారం రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, జియో ఫైబర్ సేవలను సెప్టెంబర్ 5వ తేదీ నుంచి తీసుకొస్తామని తెలిపారు. 
 
పైగా, ఇకపై సినిమా విడుదలైన తొలిరోజునే ప్రేక్షకుడు ఇంట్లో కూర్చునే టీవీలో సినిమాను చూడొచ్చునని ఈ సందర్భంగా ప్రకటించారు. 2020 నుండి జియో సెట్ అప్ బాక్స్ ద్వారా ఈ అవకాశం అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. 
 
'విశ్వరూపం' సమయంలో డి.టి.హెచ్‌లో సినిమాను డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తానని కమల్‌హాసన్ ప్రకటించగానే సినిమా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ పెద్ద ఎత్తున యుద్ధమే చేశారు. దాంతో కమల్ తన ప్రయత్నాన్ని అప్పట్లో విరమించుకున్నారు. నిర్మాతలకు జియో వల్ల కాసులు వస్తాయి. నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉండదన్నది కొందరి వాదన. 
 
కానీ తొలి రోజునే టీవీల్లో సినిమా చూసే అవకాశం వస్తే.. థియేటర్‌కు ప్రేక్షకుడు వస్తాడా? అనేది ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికే ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం తగ్గించేశారు. ఇప్పుడు రిలయన్స్.. జియో పైబర్ ప్లాన్‌ను అమలు చేస్తే సినిమా రంగంలో కీలకమైన పంపిణీదారుల వ్యవస్థకు చాలా పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది అనడంలో సందేహం లేదు.
 
ఇప్పటికే అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ సహా పలు డిజిటల్ మాధ్యమాలు వచ్చిన తర్వాత సినిమాలు సామాన్య ప్రేక్షకుడికి మరింత దగ్గరయ్యాయి. సినిమాలే కాదు.. డిఫరెంట్ కంటెంట్ ఉన్న వెబ్‌సిరీస్‌లు కూడా ఆదరణ పొందుతున్నాయి. కొత్త టాలెంట్‌కి కొత్త దారి దొరికినట్టయ్యింది. ఈ డిజిటల్ మాధ్యమాల్లో సినిమా విడుదలైన వారాల తర్వాతే సినిమాలు ప్రదర్శించాలనే నిబంధన ఉంది. మరిప్పుడు తొలిరోజునే సెట్‌అప్ బాక్స్ ద్వారా సినిమా చూసే అవకాశం అంటే డిజిటల్ మాధ్యమాలకు కూడా జియో సవాలు విసిరినట్లే.