బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2019 (12:52 IST)

ఖాతాదారులకు ఎస్బీఐ - బీవోబీ షాక్.. అలా చేస్తే బాదుడే బాదుడు

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సెక్టార్‌గా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకుతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడాలు తమ ఖాతాదారులకు తేరుకోలేని షాకిచ్చాయి.  ప్రస్తుతం అమల్లో ఉన్న మైక్రో ఏటీఎం వినియోగంపై పరిమితి విధించాయి. ఇకపై మైక్రో ఏటీఎంలలో నెలకు ఒక్కసారి మాత్రమే విత్‌డ్రా చేసుకోవాలని ఎస్.బి.ఐ షరతు విధించింది. అలాగే, బీవోబీ మాత్రం నెలకు ఐదు లావాదేవీలకు అనుమతి ఇచ్చింిద. 
 
నిజానికి ఎస్.బి.ఐ ఖాతాదారులకు ఇప్పటివరకు ఈ అవకాశం నెలకు మూడు సార్లు ఉండేది. ఇకపై నెలకు కేవలం ఒక్కదఫాకే కుదించింది. ఈ పరిమితికి మించి డ్రా చేస్తే మాత్రం భారీగా వడ్డన విధించనుంది. ఇది ఖాతాదారులకు తీవ్ర నిరాశకులోను చేసే అంశం. ఇకపోతే, ప్రభుత్వ డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ స్కీమ్‌లో భాగస్వామ్యం కాని ఖాతాదారులు మాత్రం నెలకు ఐదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
 
ఏటీఎంలు అందుబాటులో లేని మారుమూల గ్రామాల్లో బయోమెట్రిక్‌ వివరాలను వినియోగించి, రిటైల్‌ ఏజెంట్ల వద్ద వినియోగదారులు నగదును తీసుకునే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. దీన్నే మైక్రో ఏటీఎం లావాదేవీలుగా పేర్కొంటారు. 
 
అయితే.. వినియోగదారులు పలుమార్లు చిన్న చిన్న మొత్తాలుగా తీసుకుంటుండటంతో అందుకు సంబంధించిన కమిషన్‌ను ఏజెంట్లకు చెల్లించాల్సి వస్తుండటంతో తమకు నష్టం వాటిల్లుతోందని భావించిన బ్యాంకులు ఈ తరహా నిర్ణయం తీసుకున్నాయి. అయితే, ఈ నిర్ణయం వల్ల అత్యవసరంగా డబ్బులు అవసరమయ్యే వారికి తీవ్ర నష్టం జరుగుతుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.