శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr

సునీల్ మిట్టల్ దానగుణం...

దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ అధినేత, భారతీ ఎంటర్‌ప్రైజస్‌ వ్యవస్థాపకుడు సునీల్‌ మిట్టల్ తన దానగుణం చాటుకున్నారు. తమ కుటుంబానికి చెందిన మొత్తం సంపదలో 10 శాతం వాటాను దాతృత్వానికి

దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ అధినేత, భారతీ ఎంటర్‌ప్రైజస్‌ వ్యవస్థాపకుడు సునీల్‌ మిట్టల్ తన దానగుణం చాటుకున్నారు. తమ కుటుంబానికి చెందిన మొత్తం సంపదలో 10 శాతం వాటాను దాతృత్వానికి కేటాయించనున్నట్లు ప్రకటించారు. భారతీ కుటుంబానికి చెందిన మొత్తం సంపదలో 10 శాతం వాటా అయిన రూ.7 వేల కోట్లను తమ దాతృత్వ సంస్థ భారతీ ఫౌండేషన్‌కు అందించనున్నట్లు మిట్టల్ ప్రకటించారు. 
 
సమాజంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న యువతకు ఉన్నత, ఉచిత విద్యను అందించేందుకు సత్యభారతి పేరుతో యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, రోబోటిక్స్‌ వంటి సాంకేతిక విద్యను బోధించనున్నట్లు తెలిపారు. ఈ వర్శిటీని ఉత్తరభారతంలో ఏర్పాటుచేస్తామన్నారు. 
 
కాగా, ఇటీవల ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని, ఆయన భార్య రోహిణి నీలేకని తమ సంపదలో సగ భాగాన్ని దాతృత్వానికి కేటాయించనున్నట్లు ప్రకటించారు. తమ సంపదలో సగం భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించేందుకు ప్రపంచ సంపన్నులు నెలకొల్పిన 'ది గివింగ్‌ ప్లెడ్జ్'లో నీలేకని దంపతులు చేరారు. ఇప్పటికే విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ, బయోకాన్‌ ఛైర్మన్‌ కిరణ్‌ మజుందార్‌ షా తదితరులు ఈ పథకంలో భాగస్వాములుగా ఉన్న విషయం తెల్సిందే.