శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (03:21 IST)

వాటాదారుల షేర్లు కంపెనీలు కొనేస్తే లాభం ఎవరికి, నష్టం ఎవరికి?

భారతీయ ఐటీ దిగ్గజాలు ప్రస్తుతం పాడుతున్న ఒకేఒక పాట బైబ్యాక్. భారీగా నగదు నిల్వలు ఉన్న మన ఐటీ కంపెనీలు ఒకదాని వెనుక ఒకటిగా బైబ్యాక్ ప్రతిపాదనలు చేస్తూ వస్తున్నాయి. ఇంతకూ బైబ్యాక్ అంటే ఏమిటి అంటే ఒక కంపెనీ జారీ చేసిన ఈక్విటీ షేర్లను మార్కెట్లో లేదా ఓప

భారతీయ ఐటీ దిగ్గజాలు ప్రస్తుతం పాడుతున్న ఒకేఒక పాట బైబ్యాక్.  భారీగా నగదు నిల్వలు ఉన్న మన ఐటీ కంపెనీలు ఒకదాని వెనుక ఒకటిగా బైబ్యాక్ ప్రతిపాదనలు చేస్తూ వస్తున్నాయి. ఇంతకూ బైబ్యాక్ అంటే ఏమిటి అంటే ఒక కంపెనీ జారీ చేసిన ఈక్విటీ షేర్లను మార్కెట్లో లేదా ఓపెన్‌ టెండర్‌ ద్వారా తిరిగి కొనుగోలు చేయడాన్నే బైబ్యాక్‌గా వ్యవహరిస్తారు. బైబ్యాక్‌ చేపట్టడానికి పలు కారణాలు వుంటాయి. షేరు ధర ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండటం, మిగులు నగదును ఖర్చుచేయడం ద్వారా ఈక్విటీని తగ్గించడం, ఇన్వెస్టర్లకు నగదును పంచడం వంటి అంశాలే కాకుండా పన్ను లాభాల్ని పొందడానికి కూడా ప్రమోటర్లు ఈ ప్రక్రియను ఉపయోగించుకుంటుంటారు.
 
ఆ తర్వాత కంపెనీల వ్యాపార అవకాశాలు సన్నగిల్లడం, వృద్ధి మందగించడం వంటి సందర్భాల్లో  నిరుపయోగంగా ఉన్న నిధులను బైబ్యాక్‌ రూపంలో ఖర్చు చేస్తాయి. దీనివల్ల కంపెనీ మొత్తం ఈక్విటీ క్యాపిటల్‌(షేర్లు) తగ్గి.. షేరు వారీ ఆర్జన(ఈపీఎస్‌) పెరుగుతుంది. ఓపెన్‌ టెండర్‌ లేదా మార్కెట్‌ బైబ్యాక్‌ ఈ రెండు పద్ధతుల్లో షేర్లను తిరిగి కొనుగోలు చేస్తారు. బైబ్యాక్‌కు నిర్ధిష్ట వ్యవధి, ప్రస్తుత ధరపై ఎంతవరకు అధికంగా చెల్లించాలి(ప్రీమియం) అనేది కంపెనీ బోర్డు నిర్ణయిస్తుంది. ఓపెన్‌ టెండర్‌ ద్వారా అయితే, బిడ్డింగ్‌ ద్వారా ఇన్వెస్టర్ల నుంచి షేర్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది. అదే మార్కెట్‌ బైబ్యాక్‌ పద్ధతిలో మాత్రం ప్రకటించిన మేరకు బైబ్యాక్‌ను పూర్తి చేయాలన్న నిబంధనేమీ లేదు.
 
దేశీ ఐటీ కంపెనీల వద్ద ఇప్పుడు భారీ మొత్తంలో నగదు నిల్వలు ఉన్నాయి. కంపెనీలు నిరుపయోగంగా ఇంత పెద్దమొత్తంలో నగదును అట్టిపెట్టుకుంటూ.. తమకు మాత్రం ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చడం లేదని ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా విదేశీ ఐటీ దిగ్గజం కాగ్నిజంట్‌ 340 కోట్ల డాలర్ల షేర్ల బైబ్యాక్‌ ప్రణాళికను ప్రకటించడంతో దేశీ ఐటీ కంపెనీలపై మరింత ఒత్తిడి పెరిగింది.
 
మరోపక్క, ఐటీ కంపెనీలు తమ వద్దనున్న నగదు నిల్వలను అవసరం లేకున్నా కంపెనీల కొనుగోళ్లకు వెచ్చిస్తున్నాయంటూ(ఇన్ఫోసిస్‌పై మాజీ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి) ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజా బైబ్యాక్‌ ప్రకటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదిలాఉండగా.. అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్‌ వచ్చాక వీసా నిబంధనలు కఠినతరం అవుతుండటం... యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) నుంచి బ్రిటన్‌ వైదొలగడం(బ్రెగ్జిట్‌) నేపథ్యంలో అంతర్జాతీయంగా ఐటీ రంగం అనిశ్చితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా దేశీ ఐటీ కంపెనీల షేర్లు దిగజారుతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంపొందించడం, షేరు ధరకు ఊతం ఇచ్చేందుకు కూడా బైబ్యాక్‌ ఆఫర్లపై కంపెనీలు దృష్టిసారిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
 
షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ నెల 20న డైరెక్టర్ల బోర్డు సమావేశం కానుందని టీసీఎస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం ఎంతమొత్తాన్ని వెచ్చించనున్నదీ, ఎన్ని షేర్లను బైబ్యాక్‌ రూపంలో కొనుగోలు చేస్తారన్నది మాత్రం వెల్లడించలేదు. దీనిపై బోర్డు సమావేశం తర్వాత ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వేతన ప్యాకేజీల విషయంలో వ్యవస్థాపకులకు, డైరెక్టర్ల బోర్డుకు మధ్య తీవ్ర విభేదాలు వెలుగుచూసిన ఇన్ఫోసిస్‌లోనూ చాన్నాళ్లుగా బైబ్యాక్‌ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇన్ఫీలో కార్పొరేట్‌ నైతిక ప్రమాణాలు దిగజారాయంటూ స్వయంగా కీలక వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో, కంపెనీ వర్గాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.