1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (19:20 IST)

ఆంధ్రప్రదేశ్ సచివాలయంపై కరోనా పంజా.. వణికిపోతున్న ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంపై మరోమారు కరోనా వైరస్ పంజా విసిరింది. తాజాగా 14 మంది ఉద్యోగులకు ఈ వైరస్ సోకింది. ఇపుడు వీరితో కాంటాక్ట్ అయినవారు భయంతో వణికిపోతున్నారు. పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారంతా టెస్టులు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు. మరోవైపు సచివాలయాన్ని శానిటైజ్ చేశారు. ఇంకోవైపు, రాష్ట్రంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు దాదాపు 10 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. 
 
మరోవైపు, తెలంగాణలో కొవిడ్-19 కేసుల విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,018 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, అదేసమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,688 కి చేరింది. ఆస్పత్రుల్లో 25,685 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 85,223 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 780కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 475 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే, దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 32 లక్షల మార్కును క్రాస్ చేసింది. గత 24 గంటల్లో 67,151 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 1,059 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 32,34,475 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 59,449కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 24,67,759 మంది కోలుకున్నారు. 7,07,267 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.