గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 మే 2020 (09:36 IST)

ఏపీ సచివాలయ ఉద్యోగికి కరోనా!! సీఎం క్యాంపు ఆఫీసులోనూ కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగితో పాటు మరో ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. ఈ ముగ్గురు హైదరాబాద్ నుంచి వచ్చారు. దీంతో ఏపీ సచివాలయంలో కలకలం రేగింది. లాక్డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన 227 మంది ఉద్యోగులు బుధవారం ప్రత్యేక బస్సుల్లో అమరావతి చేరుకున్నారు. అనంతరం వీరి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించగా, గురువారం నుంచి వీరంతా విధులకు హాజరవుతున్నారు. 
 
అయితే, వీరిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అనే తేలింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ముగ్గురిలో ఒకరు సచివాలయంలోని ఓ శాఖలో పనిచేస్తుండగా, మిగతా ఇద్దరు గుంటూరులోని ఓ శాఖ ప్రధాన కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్నారు.
 
ముగ్గురు ఉద్యోగులు కరోనా బారినపడడంతో సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీంతో స్పందించిన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి.. రేపటి నుంచి వారం రోజులపాటు ఉద్యోగులకు 'వర్క్‌ ఫ్రం హోం' సౌకర్యం కల్పించాలని ఉన్నతాధికారులను కోరారు. 
 
ఇదిలావుంటే, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పనిచేసే కర్నూలుకు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ కూడా కరోనా బారినపడ్డాడు. నాలుగు రోజుల క్రితమే అతడు విధుల్లో చేరగా వచ్చిన వెంటనే పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షా ఫలితాలు శనివారం రాగా కరోనా సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించి మిగతా సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాలు రావాల్సివుంది.