గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2020 (11:01 IST)

దేశంలో కరోనా కొత్త కేసులు 55 వేలు.. మృతులు 702

దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా మరో 55 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. అలాగే 702 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 55,838 మందికి కరోనా నిర్ధారణ అయిందని పేర్కొంది. అదేసమయంలో 79,415 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,06,946 కి చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 702 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,16,616 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 68,74,518 మంది కోలుకున్నారు. 7,15,812 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 
 
కాగా, దేశంలో బుధవారం మొత్తం 9,86,70,363 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. బుధవారం ఒక్కరోజులోనే 14,69,984 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,456 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,292 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,27,580 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,06,105 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,292 కి చేరింది. ప్రస్తుతం 20,183 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వారిలో 16,977 మంది హోంక్వారంటైనులో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 254 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 98 కేసులు నిర్ధారణ అయ్యాయి.