1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (09:45 IST)

మహారాష్ట్రలో 70 కరోనా రోగుల అదృశ్యం...

దేశంలో కరోనా వైరస్ మహమ్మారితో వణికిపోతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది. దీంతో అటు ప్రభుత్వంతో పాటు.. ఇటు అధికార వర్గాలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా వుంటే, కరోనా వైరస్ సోకిన వారిలో పలువురు అధికారులు, వైద్య సిబ్బందిని నానా తిప్పలు పెడుతున్నారు. తాజాగా కరోనా వైరస్ సోకిన 70 మంది కనిపించకుండా పోయారు.

పైగా, పరీక్షల సమయంలో ఫోన్ నంబర్లు, ఇంటి చిరునామాను తప్పుగా ఇవ్వడం వల్ల అదృశ్యమైన వారిని గుర్తించడం చాలా కష్టంగా మారిందని బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. వారిని పట్టుకునేందుకు పోలీసుల సాయం కోరింది. అదృశ్యమైన వారందరూ కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మలాడ్‌కు చెందిన వారని అధికారులు గుర్తించారు.
 
కరోనా రోగుల అదృశ్యంపై మంత్రి అస్లామ్ షేక్ స్పందిస్తూ, ఆ రోగులంతా ఎక్కడికీ పారిపోయి ఉండరని, వారి ఫోన్ నంబర్లు, చిరునామాను నమోదు చేసుకునే క్రమంలో పొరపాటు జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. 
 
వారు తమ చిరునామాల్లో పేర్కొన్న చాలా ప్రాంతాలు మురికివాడలకు చెందినవేనని, వారిలో కొందరు వలస కార్మికులు కూడా ఉండే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఇంకొందరు కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయి కూడా ఉండొచ్చన్నారు. కాగా, తప్పిపోయిన రోగుల జాబితాను బీఎంసీ తమకు అందించినట్టు డిప్యూటీ కమిషనర్ ప్రణయ్ అశోక్ తెలిపారు.