శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 ఆగస్టు 2020 (08:33 IST)

మరో ఇద్దరు కేంద్ర మంత్రులకు - తెరాస ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు ఈ వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. తాజాగా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు, మరో తెరాస ఎమ్మెల్యే ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. 
 
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌ వాల్ కరోనా బారిన‌ప‌డ్డారు. ఆయనతో పాటు వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాశ్ చౌదరికి కూడా కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. 
 
ప్రస్తుతం అర్జున్ రామ్ మేఘ్ వాల్ ట్రామా సెంటర్ ఆఫ్ ఎయిమ్స్‌లో చేర్చగా, కైలాశ్ చౌదరి జైపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాయి. మేఘ్ ‌వాల్‌‌కు తేలికపాటి ఇన్‌‌ఫెక్షన్ మాత్రమే ఉందని తెలుస్తోంది.
 
ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్‌లకు ఈ వైరస్ సోకడంతో వారు మేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. అలాగే, వీరిని కాంటాక్ట్ అయిన మరో ఇద్దరు కేంద్ర మంత్రులు, అధికారులు కూడా సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ, పలువురు నేతలు కూడా వైరస్ బారిన పడుతున్నారు. శనివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్ సోకగా, ఆపై తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మహమ్మారి బారిన పడ్డారు. 
 
ఆయనకు వైరస్ సోకగానే, హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. కాగా, కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మరణించిన సంగతి తెలిసిందే. దాదాపు 10 రోజుల క్రితం ఆయనకు వైరస్ సోకగా, నిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన కన్నుమూశారు.