1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (10:18 IST)

దేశంలో కరోనా కేసుల రికార్డు : 3 లక్షలు క్రాస్

దేశంలో మరో 11458 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 3 లక్షలకు దాటిపోయింది. శనివారం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 11,458 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటివరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదేసమయంలో 386 మంది మరణించారు.
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,08,993కి చేరగా, మృతుల సంఖ్య 8,884కి చేరుకుంది. 1,45,779  మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,54,330 మంది కోలుకున్నారు.
 
తెలంగాణాలో 164 పాజిటివ్ కేసులు 
తెలంగాణలో కరోనా మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 9 మంది మరణించగా, ఇప్పటివరకు కరోనాతో మృత్యువాత పడిన వారి సంఖ్య 174కి పెరిగింది. ఇక కొత్తగా 164 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 
 
వారిలో 133 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,484 కరోనా కేసులు నమోదు కాగా, 2,278 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 2,032 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
ముఖ్యంగా, హైదరాబాద్ సిటీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో అధిక భాగం ఇక్కడే నమోదవుతున్నాయి. మరోవైపు నగర పోలీసులను కరోనా వణికిస్తోంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఏడుగురు పోలీసులకు కరోనా నిర్ధారణ అయింది. 
 
ఈరోజు ఆ సంఖ్య 15కు చేరింది. అంటే మరో 8 మందికి సోకింది. గత మూడు రోజుల నుంచి జరుపుతున్న పరీక్షల్లో కేసులు బయటపడుతున్నాయి. దీంతో పోలీసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు తగు చర్యలు చేపడుతున్నారు. పోలీస్ స్టేషన్‌ను శానిటైజ్ చేశారు.