శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 మే 2020 (17:01 IST)

జూలై నాటికి 10 లక్షల పాజిటివ్ కేసులు ... 4 రాష్ట్రాల్లో సామూహిక వ్యాప్తి? (video)

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతన్నాయి. ఇప్పటికే లక్షన్నర దాటిన ఈ కేసులు... జూలై నెలాఖరు నాటికి ఈ కేసు సంఖ్య పది లక్షలకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా రోజుకు ఆరు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా బుధవారానికి ఈ కేసుల సంఖ్య లక్షన్నర దాటిపోయింది. మంగళవారం సాయంత్రానికి అధికారికంగా 1.46 లక్షలకుపైగా కేసులు ఉండగా, బుధవారం ఉదయం విడుదలైన హెల్త్ బులిటెన్ గణాంకాల మేరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,51,767కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 83004 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 4,337 మంది మరణించారని, 64,426 మంది చికిత్స తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు సడలించి, ఆయా ప్రాంతాల్లో చిక్కుకుని పోయిన వలస కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తరలిస్తున్నాయి. ఈ వలస కార్మికుల తరలింపుతో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన వైరస్ ఇపుడు గ్రామీణ భారతానికి కూడా వ్యాపించింది. ఇదే ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. 
 
ప్రస్తుతం కేసులు పెరుగుతున్న విధంగానే, మరో రెండు నెలల తర్వాత, కేసుల సంఖ్య 10 లక్షలకు చేరే ప్రమాదం ఉందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దేశంలో వైరస్ సామూహిక వ్యాప్తి ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ప్రారంభమైనట్టుగానే భావించవచ్చని సీసీఎంబీ వైరాలజీ నిపుణులు వ్యాఖ్యానించారు.