1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (10:26 IST)

దేశంలో కరోనా తాజా కేసుల వివరాలు...

దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 16,311 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదేస‌మ‌యంలో 19,299 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,66,595కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 161 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,51,160కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,00,92,909 మంది కోలుకున్నారు. 2,22,526 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 18,17,55,831 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,59,209 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు, తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 224 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర  వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 461 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,90,008 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,83,924 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,566 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 4,518 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,439 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.