శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (10:40 IST)

అమెరికాలో కరోనా కేసులు కోటి : భారత్‌లో...?

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య కోటి దాటింది. ప్రపంచంలో ఒక దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య కొటి దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవలి కాలంలో రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య 10 మిలియన్ మార్క్‌ను అధిగమించింది. గడచిన పది రోజుల్లోనే అమెరికాలో పది లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి.
 
న్యూయార్క్ టైమ్స్ గణాంకాల మేరకు గడచిన 24 గంటల వ్యవధిలో 1.26 లక్షలకు పైగా కొత్త కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య 1,00,51,300కు చేరింది. గత ఏడు రోజులుగా రోజుకు సగటున లక్షకు పైగా కేసులు అమెరికాలో నమోదవుతుండటం గమనార్హం. ఇక, కేసులు అధికంగా ఉన్నాయని భావిస్తున్న భారత్, ఫ్రాన్స్ దేశాలతో 29 శాతం కేసులు అమెరికాలోనే కొత్తగా వస్తున్నాయి.
 
ఇదే సమయంలో యూఎస్ లో మహమ్మారికి 1,013 మంది బలయ్యారు. ప్రపంచంలో సంభవిస్తున్న ప్రతి 11 మరణాల్లో ఒకటి అమెరికాలోనే నమోదవుతోంది. ఇక రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, విస్కాన్సిస్, నెబ్రాస్కా, ఐయోవాల్లో కేసులు అధికంగా ఉండగా, ఇల్లినాయిస్ లోనూ మహమ్మారి విస్తరిస్తోంది. 10 శాతం కేసులు టెక్సాస్‌లోనే వస్తుండటంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 
మరోవైపు, మన దేశంలో నమోదైన కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 45,903 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,07,754 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 48,405 మంది కోలుకున్నారు.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 490 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,26,611 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 79,17,373 మంది కోలుకున్నారు. 5,09,673 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 11,85,72,192 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,35,401 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
అలాగే, తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 857 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,504 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,51,188 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,30,568 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1381 కి చేరింది. 
 
ప్రస్తుతం 19,239 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 16,449 మంది హోంక్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 250 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 112 కేసులు నిర్ధారణ అయ్యాయి.